హైదరాబాద్లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాచారం నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న డ్యూరో ఫ్లెక్స్ కంపెనీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం ధాటికి గోదాంలో ఉన్న సామాగ్రి మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఎగిసిపడుతున్న మంటలు, చుట్టుపక్కల వ్యాపించిన దట్టమైన పొగతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉండే అవకాశం ఉంది."అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా ప్రమాదమా? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

