తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు బీజేపీ నేత, మాజీ మాంత్రి డీకే అరుణ. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ జోగులాంబ దగ్గర ప్రారంభమయ్యే పుష్కరాల విషయంలో ప్రభుత్వం నేటి వరకూ ఎలాంటి చొరవ చూపడం లేదని ఆమె అన్నారు. పక్క రాష్ట్రంలో ఇప్పటికే పుష్కరాలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుండగా.. రాష్ట్రంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు.
2016లో జరిగిన కృష్ణా పుష్కరాలను అలంపూర్ అభివృద్ధిపై ఇచ్చిన హామీలే నేటికీ నెరవేర్చలేదన్నారు ప్రభుత్వానికి మంత్రాలయ పీఠాధిపతి లేఖ రాసినా స్పందన కనిపించలేదన్నారు. పుష్కరాలంటే దేవాదాయశాఖ మాత్రమే అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్కు యాదాద్రి తప్ప జోగుళాంబ అమ్మవారు కనిపించడం లేదని అన్నారు. తుంగభద్ర నది పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ చూపాలన్నారు