
అధికార టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. కేంద్రం, బీజేపీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ను “తెలంగాణ నయా గజిని” గా అభివర్ణించారు లక్ష్మణ్. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు చేసిన సాయంపై మంత్రి కేటీఆర్ తో చర్చకు సిద్ధమని అన్నారు. నయా గజిని .. కేంద్ర సాయాన్ని మర్చిపోవటం సాధారణమేనని చెప్పారు. హైద్రాబాద్ రోడ్లను బాగుచేయలేనివాడు.. కేంద్రంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు.
కేకే .. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడన్న విషయం తెలంగాణ గజినికి(కేటీఆర్ కు) గుర్తులేదని లక్ష్మణ్ అన్నారు. సిరిసిల్లలో స్వతంత్ర్య అభ్యర్థులను గుంజుకున్న చరిత్ర కేటీఆర్ ది అని, రాజ్యసభ్యుడితో దొంగ ఓటు వేయించటం టీఆర్ఎస్ కే చెల్లిందని అన్నారు. నిజామాబాద్ మేయర్ సహా.. తుక్కుగూడ, నేరేచుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ నిజాయతీ ఏపాటిదో తేలిపోయిందన్నారు.
తమ అవినీతి బయటపడ్తోందనే.. కాళేశ్వరం ప్రాజక్ట్ డీపీఆర్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వటం లేదని విమర్శించారు . డీపీఆర్ ఇవ్వకుండా.. పోలవరానికి జాతీయహోదా ఎలా సాధ్యమవుతుందని లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఢిల్లీలో కాళ్ళు.. తెలంగాణలో కన్నీళ్ళు తెలంగాణ గజనీకి అలవాటేనన్నారు. నీటి ప్రాజెక్టులకు కేంద్రమిచ్చిన అనుమతుల గురించి తన బావ హరీష్ నడిగి కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా.. అప్పటి ఏపీకి ఎన్ని నిధులిచ్చారో కేటీఆర్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ఆదాయ వనరులు పెంచుకోకుండా.. కేంద్రం మీద నెపం వేయటం చేతకాని తనం అవుతుందని, కేంద్ర పథకాలకు పేరు మార్చి ప్రచారం చేసుకుంటోన్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ అన్నారు.