తెలంగాణలో ఉన్నంత ఫీజుల దందా దేశంలో ఎక్కడా లేదు : లక్ష్మణ్

తెలంగాణలో ఉన్నంత ఫీజుల దందా దేశంలో ఎక్కడా లేదు : లక్ష్మణ్

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఫీజులున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో చదువు కొనే పరిస్థితి ఉందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాల ఫీజుల దందా, దోపిడీని అరికట్టాలని బీజేపీ యువ మోర్ఛా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఫీ రెగ్యులేషన్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడీని వ్యతిరేకిస్తూ మంగళవారం నాడు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ ,  బీజేవైఎం నేతలు మహిపాల్ రెడ్డి, రవి కుమార్, వినయ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.

మరోవైపు… ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అధిక ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది ఏబీవీపీ. ఇంజినీరింగ్ బీసీ సీట్లను ఆన్ లైన్ ద్వారా భర్తీ చేయాలంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. హైదరాబాద్ TAFRC కార్యాలయంలో బైఠాయించారు. ఫీజులు విద్యార్ధులకు అనుకూలంగా లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామంటున్నారు.