V6 News

ఇండిగో విమానంలో ఏసీ బంద్.. పాపం ఈ ఎయిర్ హోస్టెస్లు !

ఇండిగో విమానంలో ఏసీ బంద్.. పాపం ఈ ఎయిర్ హోస్టెస్లు !

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లోని ఇండిగో విమానంలో ఏసీ బంద్ అయింది. గాలి అందక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి కావడంతో ఎయిర్ హోస్టెస్లు పేపర్లనే విసనకర్రలుగా చేసి ప్రయాణికులకు గాలిని అందించే ప్రయత్నం చేశారు.

గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ కొందరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో (6E 6684) విమానంలో ఈ ఘటన జరిగింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండిగో వరుస వైఫల్యాలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. నవంబర్ 1, 2025 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల రెండో దశ కారణంగా ఇండిగోలో సంక్షోభం రేగిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు పైలట్‌‌‌‌‌‌‌‌ల వారపు విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచాయి.  ఇది పైలట్‌‌‌‌‌‌‌‌ల అలసట రిస్క్‌‌‌‌‌‌‌‌ను తగ్గిస్తుంది. ఈ మార్పులు విమాన ప్రయాణాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలని లక్ష్యంగా చేసిన ప్రయత్నం.

ఈ నిబంధనల గురించి రెండు సంవత్సరాల ముందు నుంచే పూర్తి అవగాహన ఉన్నప్పటికీ,  కొత్త నిబంధనలకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవడంతోపాటు రోస్టరింగ్ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇండిగో నిర్లక్ష్యం వహించింది. 

భారతదేశంలో అత్యధిక విమానాలను నడుపుతున్న సంస్థగా, సిబ్బంది కొరతను సరిచేయడానికి ఇండిగో ప్రణాళికా లోపం సంస్థ కార్యకలాపాలను ఒక్కసారిగా కుప్పకూల్చింది. ఇప్పుడిప్పుడే సంక్షోభ సమయం నుంచి బయటపడి కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయనుకుంటున్న తరుణంలో ఇండిగో విమానాల్లో కనీస సదుపాయాలు కూడా లేకుండా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న ఘటనలు మరోమారు విమర్శలకు తావిచ్చాయి.