మజ్లిస్​ కోటలో వికసిస్తున్నకమలం

మజ్లిస్​ కోటలో వికసిస్తున్నకమలం

మజ్లిస్​కంచుకోట పాతబస్తీలో బీజేపీ బలం పెంచుకుంటోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పటి కంటే లోక్​సభ ఎన్నికల్లో పెద్దమొత్తంలో ఓట్లు కొల్లగొట్టింది. గత లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగిన భాగ్యనగర గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అసదుద్దీన్​ఒవైసీకి గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవానికి 2014 లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొత్తుతో బీజేపీ  అభ్యర్థులను బరిలో దింపింది. అయితే,  ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ బలంతో లోకసభ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో కలిపి బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు మూడు లక్షల వరకు ఓట్లు పోలై ఎంఐఎం అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుత లోక్​సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసిన బీజేపీకి అనూహ్యంగా ఓట్లు పోలయ్యాయి. ఏడు నియోజక వర్గాల్లో అభ్యర్థి భగవంతరావుకు రెండు లక్షల 35వేల ఓట్లు  రావడంపై బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్​ లోక్​సభ స్థానానికి 38శాతం పోలింగ్​ నమోదు కావడం ఒక ఎత్తయితే.. ఒంటరిగా బరిలో నిలిచిన అభ్యర్థికి ఏడు నియోజకవర్గాలలో ఓటింగ్​ పెరగడంపై ఆ పార్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్ పార్లమెంట్​ నియోజకవర్గానికి మజ్లిస్​ కంచుకోట. ఈ కోటలో బీజేపీ పాగా వేసేందుకు దశాబ్దకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, గత లోకసభ ఎన్నికల కంటే.. మొన్నటి అసెంబ్లీతోపాటు ప్రస్తుత ఎలక్షన్​లో బీజేపీ ఇంచుమించుగా పుంజుకుంది.  అయితే, 2014  లోక్​సభ ఎన్నికల్లో సైతం బీజేపీ తరపున బరిలో నిలిచిన భాగ్యనగర గణేష్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఓల్డ్​ సిటీలో ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చారు.  అసదుద్దీన్ ఓవైసీకి 5,13,868 ఓట్లు, బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు 3,11,414 ఓట్లు వచ్చాయి.  ఆనాడు 2,02,454 ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్​ ఘనవిజయం సాధించారు.  తాజాగా 2019 ఎన్నికల ఫలితాల్లోనూ అసదుద్దీన్​కు భగవంతరావు మరోమారు గట్టి పోటీ ఇచ్చారు.  హైదరాబాద్​ పార్లమెంటరీ స్థానంలోని  గోషామహల్, చాంద్రాయణగుట్ట, కార్వాన్​, మలక్​పేట, బహదూర్​పురా, యాకత్​పురా, చార్మినార్​ నియోజకవర్గాలున్నాయి. ఆయా సెగ్మెంట్​ల పరిధిలో గతంలో కంటే ఈసారి బీజేపీకి ఓట్లు ఎక్కువగానే పోల్​అయ్యాయి. ఈ ఎంపీ స్థానం పరిధిలో గోషామహల్​ నుంచి బీజేపీకి సిట్టింగ్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ కూడా ఉన్నారు. బీజేపీ ప్రతి ఎన్నికల్లో ఇక్కడి నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఓట్లను రాబడుతోంది. గతంలో కంటే కూడా ఈసారి అన్ని లోకసభ స్థానాల కంటే కూడా ఇక్కడ తక్కువ శాతం ఓటింగ్​ నమోదైంది. మరోవైపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు శాసనసభ స్థానాలకు మజ్లిస్​ పార్టీ నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఈసారి లోకసభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఓటింగ్​ శాతం పెరగడంపై ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.