మజ్లిస్కంచుకోట పాతబస్తీలో బీజేపీ బలం పెంచుకుంటోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పటి కంటే లోక్సభ ఎన్నికల్లో పెద్దమొత్తంలో ఓట్లు కొల్లగొట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగిన భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అసదుద్దీన్ఒవైసీకి గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవానికి 2014 లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొత్తుతో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ బలంతో లోకసభ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో కలిపి బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు మూడు లక్షల వరకు ఓట్లు పోలై ఎంఐఎం అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసిన బీజేపీకి అనూహ్యంగా ఓట్లు పోలయ్యాయి. ఏడు నియోజక వర్గాల్లో అభ్యర్థి భగవంతరావుకు రెండు లక్షల 35వేల ఓట్లు రావడంపై బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి 38శాతం పోలింగ్ నమోదు కావడం ఒక ఎత్తయితే.. ఒంటరిగా బరిలో నిలిచిన అభ్యర్థికి ఏడు నియోజకవర్గాలలో ఓటింగ్ పెరగడంపై ఆ పార్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మజ్లిస్ కంచుకోట. ఈ కోటలో బీజేపీ పాగా వేసేందుకు దశాబ్దకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, గత లోకసభ ఎన్నికల కంటే.. మొన్నటి అసెంబ్లీతోపాటు ప్రస్తుత ఎలక్షన్లో బీజేపీ ఇంచుమించుగా పుంజుకుంది. అయితే, 2014 లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీ తరపున బరిలో నిలిచిన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీకి 5,13,868 ఓట్లు, బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు 3,11,414 ఓట్లు వచ్చాయి. ఆనాడు 2,02,454 ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్ ఘనవిజయం సాధించారు. తాజాగా 2019 ఎన్నికల ఫలితాల్లోనూ అసదుద్దీన్కు భగవంతరావు మరోమారు గట్టి పోటీ ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలోని గోషామహల్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట, బహదూర్పురా, యాకత్పురా, చార్మినార్ నియోజకవర్గాలున్నాయి. ఆయా సెగ్మెంట్ల పరిధిలో గతంలో కంటే ఈసారి బీజేపీకి ఓట్లు ఎక్కువగానే పోల్అయ్యాయి. ఈ ఎంపీ స్థానం పరిధిలో గోషామహల్ నుంచి బీజేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు. బీజేపీ ప్రతి ఎన్నికల్లో ఇక్కడి నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఓట్లను రాబడుతోంది. గతంలో కంటే కూడా ఈసారి అన్ని లోకసభ స్థానాల కంటే కూడా ఇక్కడ తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు శాసనసభ స్థానాలకు మజ్లిస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఈసారి లోకసభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడంపై ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.