భాగ్యనగర వాహనదారులకు అలెర్ట్. హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులకు రంగం సిద్ధమైంది. దీనిపై హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ చెప్పిన వివరాల ప్రకారం.. వచ్చే ఆదివారం అంటే ఏప్రిల్ 5వ తేదీన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు (సుమారు మూడు గంటల పాటు) ఈ వన్ వే ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ప్రధాన మళ్లింపులు ఇలా:
- పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వారు: రోడ్ నెంబర్ 2 లో డైవర్షన్ తీసుకోవాలి. అక్కడి నుండి ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా రోడ్ నెంబర్ 45కు చేరుకుని మాదాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- మాదాపూర్ (రోడ్ నెంబర్ 45) నుండి పంజాగుట్ట వైపు వచ్చే వారు: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపునకు మళ్లిస్తారు.
- రోడ్ నెంబర్ 10, 12 నుండి వచ్చే వాహనాలు: అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుండి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుండి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
రానున్న రోజుల్లో శాశ్వతంగా ఇదే రూట్ లో వాహన రాకపోకలను కొనసాగించే యోచనలో ఉన్నట్లు జోయెల్ డెవిస్ తెలిపారు. అందుకే ఆదివారం నిర్వహించే ఈ ట్రయల్ రన్ ను ప్రజలందరూ గమనించాలని, ట్రాఫిక్ అడ్వైజరీ సూచనలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
►ALSO READ | క్వేక్ అరీనా పబ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు...
