జర్మనీ నేర్చుకుంది.. కొలువు కొట్టింది.. నెలకు రూ.3 లక్షల 5 వేలవేతనం

జర్మనీ నేర్చుకుంది.. కొలువు కొట్టింది.. నెలకు రూ.3 లక్షల 5 వేలవేతనం
  •     నెలకు రూ.3.5 లక్షల  ప్రారంభ వేతనం  
  •     ఫిజియోథెరపిస్టు పి.ఐశ్వర్యరాణికి జర్మనీలో జాబ్


హైదరాబాద్, వెలుగు: పట్టుదలతో నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, విదేశీ భాషపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలంగాణ యువ ఫిజియోథెరపిస్టు పి.ఐశ్వర్యరాణి నిరూపించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌కామ్) సహకారంతో జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా ఉద్యోగం సాధించారు. నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఆమె అక్కడ విధుల్లో చేరనున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఐశ్వర్యరాణి టామ్‌‌‌‌కామ్‌‌‌‌ను సంప్రదించారు. జర్మనీలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా టామ్‌‌‌‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్మన్ భాష శిక్షణలో చేరారు.

భాషా నైపుణ్యంతో పాటు ఉద్యోగానికి అవసరమైన ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి వివేక్ వెంకటస్వామి ఐశ్వర్యరాణికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విదేశాల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు మంచి డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టామ్‌‌‌‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ అందిస్తూ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నామని చెప్పారు. ఐశ్వర్యరాణి సాధించిన విజయం విదేశాల్లో కెరీర్‌‌‌‌ను నిర్మించుకోవాలనుకునే రాష్ట్ర యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఐశ్వర్యరాణి జర్మనీలో నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగంలో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ విధుల్లో చేరిన అనంతరం అవసరమైన వృత్తిపరమైన శిక్షణలను పూర్తి చేయాల్సి ఉంటుందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె వేతనం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు.


సమాచారం చేరవేయడంలో పీఆర్ వ్యవస్థే కీలకం: వివేక్

సైఫాబాద్, వెలుగు: సమాజానికి విశ్వసనీయమైన సమాచారం చేరవేయడంలో పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. పీఆర్ రంగంలో ఉన్నవారు ట్రస్ట్, ట్రూత్, ట్రాన్స్‌‌‌‌పరెన్సీ అనే మూడు విలువలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గురువారం నాంపల్లిలోని ఎఫ్‌‌‌‌టీసీసీ భవన్‌‌‌‌లో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ), సీవీఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తోందని, భవిష్యత్తులో పీఆర్‌‌‌‌కు సంబంధించిన షార్ట్‌‌‌‌టర్మ్ కోర్సులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ పీఆర్ మేనేజర్, పీఆర్ కౌన్సిలర్, పీఆర్ టీచర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సీవీఎన్ బెస్ట్ పీఆర్ మేనేజర్ అవార్డు-2026ను సకత్ చక్రవర్తి, బెస్ట్ పీఆర్ కౌన్సిలర్ అవార్డులను సుసాన్ స్ఫూర్తి, రాకేశ్, బెస్ట్ పీఆర్ టీచర్ అవార్డును ఉపేంద్ర అందుకోగా, పలువురు విద్యార్థులను కూడా సత్కరించారు. పీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ జాతీయ అధ్యక్షుడు అజిత్ పతక్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.