కశ్మీర్‌‌లో బీజేపీ నేతను కాల్చి చంపిన టెర్రరిస్టులు

కశ్మీర్‌‌లో బీజేపీ నేతను కాల్చి చంపిన టెర్రరిస్టులు

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత మరణించారు. మంగళవారం నాడు కుల్గాం జిల్లా బ్రజ్లూజగిర్ గ్రామంలో బీజేపీ నేతపై కాల్పులు జరిపి టెర్రరిస్టులు హత్య చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని జావీద్ అహ్మద్ దార్‌‌గా పోలీసులు గుర్తించారు. ఆయన కశ్మీర్‌‌లోని హోం షాలీ బగ్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. టెర్రరిస్టుల చర్య సిగ్గు చేటని కశ్మీర్ బీజేపీ మీడియా సెల్ మంజూర్‌‌ అహ్మద్ అన్నారు. బాధిత కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు. 

కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై స్పందించారు. కుల్గాంలో జావీద్ అహ్మద్‌ను టెర్రరిస్టులు హత్య చేసినట్లు తెలిసిందని, ఈ దాడిని తాను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. జావీద్ కుటుంబానికి తన సంతాపం తెలుపుతున్నానని అన్నారు. జావీద్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.