వాషింగ్టన్: అమెరికా అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైనా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇరాన్కు చెందిన ఓడరేవులను అమెరికా నేవీ బలగాలు చుట్టుముట్టాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధిలో భారీగా బలగాలను మోహరించింది. హార్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి.
హార్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగించాలంటే ఏ దేశమైనా సరే తమ అనుమతి తీసుకోవాలని అమెరికా ఫోర్సెస్ తేల్చి చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దళాలు మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హార్మూజ్ జలసంధి దగ్గర గంభీర వాతావరణం అవరించింది. ఏ క్షణాన ఏం జరగబోతుందోనని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అమెరికాకు ఇరాన్ వార్నింగ్
అమెరికా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ పోర్టులను దిగ్భంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా బలగాలను హెచ్చరించింది ఇరాన్. తమ ఓడరేవులకు ముప్పు వాటిల్లితే తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఓడరేవులను ధ్వంసం చేస్తామని ఇరాన్ బెదిరించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతోందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

