ఆమెతో ఏడాదిగా రిలేషన్ లో ఉన్నా.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో ఏముందంటే?

ఆమెతో ఏడాదిగా రిలేషన్ లో ఉన్నా.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో ఏముందంటే?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం  రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం జులై 20న మోతీనగర్‌లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలో లేరని, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో తనకు ఏడాది కాలంగా రిలేషన్‌షిప్ ఉందని ఆయన ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. ఆ తర్వాత కూడా తమ మధ్య సంబంధం కొనసాగిందని వివరించారు. ఆమె తన రూమ్‌కు వచ్చి డోర్ తీయమని అడిగినట్లు, దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు కూడా చెప్పినట్లు ఆయన నోట్‌లో రాశారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి నలుగురు వ్యక్తులు కారణమంటూ వారి పేర్లను కూడా ప్రస్తావించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆయనను అకాడమీ నుంచి పంపించివేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు బయటపెట్టడం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.