హైదరాబాద్ సిటీ జనానికి షాకింగ్ న్యూస్. కారు, బైక్ లేకపోయినా.. ఎంచక్కా రాపిడో, ఓలా, ఉబెర్ ఉంది కదా అనే ధీమాతో ఎక్కడికి కావాలంటే అక్కడికి.. మన ఇంటి నుంచే ఎంచక్కా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు నుంచి షాకింగ్ వార్త వచ్చింది. రేపటి నుంచి.. అంటే 2026, జూలై 22వ తేదీ నుంచి ఉబెర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. రైడింగ్ బంద్ చేస్తున్నారు.
ఉబెర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో వంటి యాప్ ఆధారిత డ్రైవర్లు తెలంగాణవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు. 2026, జులై 22న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ముషీరాబాద్లోని సీఐటీయు కార్యాలయంలో మంగళవారం (జులై 21) తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్ల ఫోరం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం జులై 22న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. సమ్మె వల్ల కలిగే అసౌకర్యానికి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. చాలా కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యల కారణంగా సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిగ్ వర్కర్ల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా ఇతర ఖర్చులు పూర్తిగా డ్రైవర్ మీదనే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్లతో సంప్రదించి రవాణా సేవలకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ఇతర యాప్ ఆధారిత సేవా సంస్థలకు చెందిన వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్స్ ఇవే:
- కార్మికులు సంక్షేమ పథకాల అమలు
- అగ్రిగేటర్ కంపెనీలపై కఠినమైన నియంత్రణ
- గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల నిబంధనలను తక్షణమే అమలు చేయడం
- గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు
- మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025ను అమలు
