- జూరాల డ్యాంతో పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నా
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు కింద కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. జూరాల డ్యాంపై గద్వాల–ఆత్మకూరు రహదారిపై, కర్నూల్–గద్వాల రహదారిపై, కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జూరాల ఆయకట్టు కుడి కాలువ కింద నెల రోజుల పాటు నీటిని విడుదల చేశారని చెప్పారు. జూరాల ఆయకట్టు కింద వరి మాత్రమే పండుతుందని, సాగునీరు రావడంతో వరి సాగు చేశామని తెలిపారు. ఈక్రమంలో నీటి విడుదలను నిలిపివేయడంతో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జూరాల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నీటి విడుదలపై క్లారిటీ ఇస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
మంత్రి ఉత్తమ్కు డీకే అరుణ ఫోన్
జూరాల ఆయకట్టులో సాగు చేసిన పంటలను కాపాడాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆమె ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. సాగునీరు అందకు పంటలు ఎండిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
