
- ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు
- రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు
- మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే
- విద్యుత్ రంగంలోనే రూ.1.37 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించినం
- ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అప్పుల్లో రాష్ట్రానిది 24వ ర్యాంక్
- తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల అప్పులు ఎక్కువ
- ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నా
హైదరాబాద్, వెలుగు : తాము రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ ప్రతిసారీ అధికార పక్షం మాట్లాడడం సరికాదని, తాము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నదని, ఏ విచారణ కమిటీని వేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. డ్రగ్స్ను నిర్మూలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి శాతం తమ సహకారం ఉంటుందని చెప్పారు.
శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అప్పుల కన్నా ఆస్తులనే ఎక్కువగా సృష్టించామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని, తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దేశానికి ఫార్మా హబ్, వ్యాక్సిన్ హబ్గా ఉన్న సిటీని మళ్లీ తిరోగమనం దిశగా తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారని, ఫార్మా సిటీ రద్దు దారుణమని మండిపడ్డారు. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ శ్వాస, ఆశ కోసమే బతుకుతున్నాం. అలాంటి తెలంగాణను ఢిల్లీ నుంచో, కర్నాటక నుంచో రిమోట్ కంట్రోల్ గవర్నమెంట్లా పాలిస్తామంటే సహించేది లేదు”అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
సీఎంది దివాలాకోరు ప్రసంగం
ఒక్క విద్యుత్ రంగంలోనే తమ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు రూ.1,37,570 కోట్లకుపైనేనని కేటీఆర్ చెప్పారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, 1080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్, 800 మెగావాట్ల కేటీపీఎస్ గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి డిస్కంలకు రూ.11 వేల కోట్ల అప్పులుంటే.. తమ ప్రభుత్వం రూ.9 వేల కోట్లు కట్టిందని చెప్పుకొచ్చారు. ‘‘సివిల్ సప్లైస్ శాఖకు రూ.56 వేల కోట్ల అప్పులున్నాయని అంటున్నారు.
కానీ అదే సివిల్ సప్లైస్ దగ్గర రూ.36 వేల కోట్ల విలువైన స్టాక్స్ ఉన్నాయి. కేంద్రం నుంచి మరో రూ.17 వేల కోట్లు రావాల్సి ఉంది. మొత్తం కలిపితే అప్పుల కన్నా ఆస్తులే ఎక్కువ ఉంటాయి. తెలంగాణ దివాలా తీసిందంటూ సీఎం దివాలాకోరు ప్రసంగం చేశారు”అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తాము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచామని చెప్పారు. ‘‘అప్పులు.. అప్పులు అంటున్నారు. కానీ తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల అప్పులు ఎక్కువ. మన దేశ జీడీపీలో డెట్ 57 శాతం అయితే.. తెలంగాణది 27.8 శాతం. అప్పుల్లో తెలంగాణ ర్యాంక్ 24. అది ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు. వడ్డీల భారం కూడా వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానిదే తక్కువ.
కాళేశ్వరం కడితే అప్పు అవుతుందా?
కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను కడి తే అది అప్పు అవుతుందా.. పెట్టుబడి అవుతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదరికాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు సున్నా అని అన్నారు. ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు అప్పులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ‘‘మేము కట్టిన సెక్రటేరియెట్లోనే ప్రస్తుత ప్రభుత్వం పాలన సాగిస్తున్నది.
కలెక్టరేట్లు, రోడ్లు, యాదాద్రి ఆలయం దాకా కట్టింది కేసీఆరే. నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలు కట్టింది కేసీఆరే. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలను కట్టించాం’’ అని చెప్పారు. ‘‘పంట బీమాకు, రైతుబీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా. వ్యక్తిగతంగా దారుణంగా మాట్లాడుతున్నారు. నేరెళ్ల, శాండ్ మాఫియా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై రూ.39 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చింది ఐదు వేల కోట్లు మాత్రమే” అని చెప్పారు.
పదేండ్లలో సంక్షేమాన్ని స్వర్ణయుగంగా మార్చినం
పదేండ్లలో సంక్షేమాన్ని స్వర్ణయుగంగా మార్చామని కేటీఆర్ అన్నారు. ‘‘పాలమూరు వలసలు బంద్ అయ్యా యి. సిరిసిల్లను కాంగ్రెసోళ్లు ఉరిశాలగా మారిస్తే.. మేము సిరిశాలగా మార్చాం. అసలు ఐటీఐఆర్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరికైనా తెలుసా”అని ప్రశ్నించారు. తమ హయాంలో 2022కు ముందే రూ.2.31 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించామని, ఐటీఐఆర్తో 2033లో సాధ్యమయ్యేదానిని ఇప్పుడే చేసి చూపించామని అన్నారు.
ఆరు గ్యారంటీల్లో 2 అమలు చేశామని అంటున్నారు. కానీ ఆ రెండు గ్యారంటీల్లో పావలా వంతు కూడా అమలు చేయలేదు. లగ్జరీ, గరుడ బస్సుల్లోనూ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని ఎన్నికలప్పుడు చెప్పి.. ఇప్పుడు కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకే పరిమితం చేశారు. 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మార్చి 18 వరకు వేచి చూస్తాం. అధికారంలోకి రాగానే రైతులకు రూ.15 వేలు వేస్తామన్నారు. ఇంతవరకు అమలు జరగలేదు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?”అని నిలదీశారు.
ఆస్తులను కొనేందుకే అప్పులు
ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శ్వేత పత్రాలను ప్రచురించాల్సిన అవసరం లేదని, తాము ప్రచురించినవి ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అప్పులు ఆస్తుల నిర్మాణం కోసమే తప్ప.. దుబారా కోసం కాదన్నారు. ఆస్తులను కొనేందుకే అప్పులు తీసుకున్నామ ని చెప్పారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ విని యోగం 2,900 యూనిట్లుగా ఉందని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్ కోసం ఏటా రూ.10 వేలకోట్లు చెల్లించామని తెలిపారు.
గావుకేకలతో విద్యుత్ రంగాన్ని బాగు చేయలేమని ఎద్దేవా చేశారు. రైతుల పొలం ఎండిపోవద్దన్న ఉద్దేశంతోనే కరెంట్ కొనుగోళ్ల కోసం ఓపెన్ మార్కెట్కు పోయామ ని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని తేల్చి చెప్పామని, కాంగ్రెస్ వాళ్లు పెడ్తరో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘పంజాబ్ గురించి చెప్తున్న సీఎం.. ఇంతకా లం అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ దే అని గుర్తుపెట్టుకోవాలి. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ను ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ సర్కారు. డ్రగ్స్ విషయంలో మా సహకారం ప్రభుత్వానికి ఉంటుంది” అని చెప్పారు