తెలంగాణ సహా 15 రాష్ట్రాలకు పంపనున్న కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హైలెవెల్ సెంట్రల్ టీమ్స్ను పంపిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాల్లో ఆ టీమ్స్ కరోనా పరిస్థితిని అంచనా వేస్తాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేగాకుండా కంటెయిన్మెంట్ జోన్లలో స్థానిక అధికారులకు కరోనా నిర్వహణపై సాయం అందిస్తాయని చెప్పింది. రెండు నెలల పాటు టెస్టింగ్లో లోపాలు, టెస్టుల సంఖ్య, కేసుల పరిస్థితి, ఆస్పత్రుల్లో పడకల కొరత, మరణాల రేటు, డబ్లింగ్ రేటు వంటి విషయాలపై పనిచేస్తాయని పేర్కొంది.
తెలంగాణలోని 4 జిల్లాల్లో సెంట్రల్ టీంలు పరిస్థితిని అంచనా వేయనున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో 7 చొప్పున జిల్లాల్లో పర్యటించనున్నాయి. అస్సాంలో 6, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 5 చొప్పున, హర్యానా, కర్నాటక, బీహార్, ఉత్తర్ప్రదేశ్లలో 4 చొప్పున, గుజరాత్, ఉత్తరాఖండ్, వెస్ట్బెంగాల్లో 3 చొప్పున జిల్లాల్లో సెంట్రల్ టీంలు విజిట్ చేస్తాయి. అన్ని జిల్లాల్లోని కంటెయిన్మెంట్ ఏరియాల్లో అధికారులకు సెంట్రల్ టీంలు టెక్నికల్ సాయాన్ని అందిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. వైరస్ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరైన ట్రీట్మెంట్, క్లినికల్ మేనేజ్మెంట్లో తోడ్పాటును అందిస్తాయని చెప్పింది. ఒక్కో టీంలో ముగ్గురు సభ్యులు ఉంటారని, అందులో ఇద్దరు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్లు, ఒక సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి నోడల్ ఆఫీసర్ ఉంటారని పేర్కొంది.