తమిళనాడులో ఫ్లెక్సీ కారణంగా ఓ యువతి మృతి చెందిన ఘటనపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. అన్నాడీఎంకే నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ కారణంగానే శుభ శ్రీ అనే యువతి మరణించడంతో ఇకపై బ్యానర్లు, పోస్టర్లు కట్టే మీటింగ్ లకు తాను హాజరుకానని, ఒకవేళ తన ఆదేశాలను విస్మరించి బ్యానర్లు కడితే పార్టీ కేడర్ పై తగు చర్యలు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించేలా అన్నాడీఎంకే కార్యకర్తలు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడం పై స్టాలిన్ మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ బ్యానర్లను సమాజంపై, సాధారణ ప్రజలపై చూపే ప్రతికూల ప్రభావాన్ని గ్రహించకుండా కడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న శుభ శ్రీ అనే యువతి.. బైక్ పై వెళుతుండగా అన్నాడీఎంకే నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుకే వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆమె పైకి దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ప్రజల క్షేమం గురించి ఆలోచించకుండా ఇలా నడిరోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని స్టాలిన్ ఖండించారు.