రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ధరణీ పోర్టల్

రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ధరణీ పోర్టల్
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సిఎం వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితా సభర్వాల్, మీ సేవ సిఇవో వెంకటేశ్వర్ రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, కలెక్టర్లు వెంకట్రాం రెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సిఎం ఆదేశించారు. ధరణి ధరణి రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను.. డాక్యుమెంట్ల ఆధారంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలని సూచించారు. మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలని ఆదేశించారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను.. కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని కేసీఆర్ అన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలని, 1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలన్నారు. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని చోట్ల ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయని, ఆ సర్వే నెంబరును నిషేధిత జాబితా (22/ఎ) లో పెట్టారని, అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమలో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలన్నారు సీఎం. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. “కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్ ను ధరణిలో చేర్చాలి. ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి.అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశం ఇవ్వాలి” అని సీఎం తెలిపారు.