
హైదరాబాద్: గద్దర్ సినీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్కు సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రదానం చేశారు. అవార్డుతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేశారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు మొత్తం 30 సినిమాలకు ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది.
2024లో విడుదలైన పుష్ప 2 సినిమా గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా ఎంపికయ్యాడు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం (జూన్ 14) హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరగగా.. అవార్డు అందుకోవడం కోసం సీఎం అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ప్రదానం చేశారు. ఇదే ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ హగ్ చేసుకున్న సీన్.. మొత్తం కార్యక్రమానికే హైలెట్గా నిలిచింది.
ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. హీరోలు అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సీనియర్ హీరోయిన్స్ సుహాసినీ, జయసుధ, హేమా మాలిని, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మురళీ మోహన్, కీరవాణి, సింగర్ రేవంత్, ఎస్జే సూర్య తదితరులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దిల్రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.