
హైదరాబాద్, వెలుగు : సిటీలోని మెయిన్ జంక్షన్ల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్ జోన్ పరిధి సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్ఎఫ్సీఎల్ వద్ద జరుగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. సిటీలోని జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఎన్ ఎఫ్సీఎల్ వద్ద ఫ్లైఓవర్ కింద ఫుట్ పాత్, సెంట్రల్ మీడియన్ పనులను చేపట్టాలన్నారు. అనంతరం కేబీఆర్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి వాకర్స్ను అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్ పునర్మిర్మాణం, ప్లాంటేషన్, ల్యాండ్ స్కేపింగ్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆహ్లదకర వాతావరణం కల్పించేందుకు పూల మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దొత్రె, అడిషనల్ కమిషనర్ యూబీడీ కృష్ణ, ఎస్ఈ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.