మే 5న జగన్ జీవో తెస్తే.. 11న కేసీఆర్ సమీక్ష చేశారు

మే 5న జగన్ జీవో తెస్తే.. 11న కేసీఆర్ సమీక్ష చేశారు

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 పై కాంగ్రెస్ నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంపై కాంగ్రెస్ నేత‌లు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ లు గురువారం బి ఆర్ కే భవన్ లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత కుమార్ ను క‌లిశారు. మహబూబ్ నగర్,రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నుండి నీటిని తరలించేందుకు ఏపీ జీవో తెచ్చినా… కేసీఆర్ కు పట్టడంలేదని అన్నారు. మే 5న జగన్ ప్రభుత్వం జీవో తెస్తే ..మే 11న కేసీఆర్ సమీక్ష చేశారని విమర్శించారు. 55వేల క్యూసెక్కుల నీళ్ళు పోతిరెడ్డి పాడు నుండి వెళుతుంటే ఆరేళ్లుగా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ అనుమతితోనే ఏపీ సీఎం జగన్ జీవో 203 తెచ్చారని, కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు అందుకే జీవో 203 గురించి మాట్లాడటం లేదని అన్నారు. ఏపీకి ఇష్టం వచ్చినప్పుడు గేట్ తెరుచుకుని నీళ్ళను దోచుకుంటుందని అన్నారు . పోతిరెడ్డి పాడు కేసీఆర్, జగన్ ఇంటి సమస్య కాదని, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని అన్నారు.

పోతిరెడ్డి పాడు జల దోపిడీపై పీఎం మోడీ, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాస్తామన్నారు రేవంత్ రెడ్డి. నాడు పోతిరెడ్డి పాడుపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు అలుపెరగని పోరాటం చేశారన్నారు. పోతిరెడ్డి పాడు నీళ్ళ దోపిడీని కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందన్నారు.