దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5,355 మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,26,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,09,462 మంది పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 48.27 శాతానికి చేరిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 1.43 లక్షల టెస్టులు
దేశంలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ బాగా పెరిగిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 507 ప్రభుత్వ ల్యాబ్స్, 217 ప్రైవేటు ల్యాబ్స్ పని చేస్తున్నాయని, గడిచిన 24 గంటల్లో 1,43,661 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 43,86,379 టెస్టులు చేసినట్లు చెప్పింది.
భారీగా పెరిగిన వైద్య సదుపాయాలు
దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు భారీగా వైద్య సదుపాయాలు మెరుగుపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. జూన్ 5 వరకు దేశ వ్యాప్తంగా 957 కోవిడ్ ఆస్పత్రుల్లో లక్షా 66 వేల 460 ఐసోలేషన్ బెడ్స్, 21 వేల 473 ఐసీయూ బెడ్స్, 72 వేల 497 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అలాగే 2,362 కోవిడ్ హెల్త్ సెంటర్లలో లక్షా 32 వేల 593 ఐసోలేషన్ బెడ్స్, 10 వేల 903 ఐసీయూ బెడ్స్, 45 వేల 562 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయని కేంద్రం చెప్పింది. అలాగే 11 వేల 210 క్వారంటైన్ సెంటర్లు, 7 వేల 529 కోవిడ్ కేర్ సెంటర్లలో ఏడు లక్షల 3 వేల 786 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు కోటి 28 లక్షల ఎన్95 మాస్కులు, కోటి 4 వేల పీపీఈ కిట్లు అందజేసిందని చెప్పింది.