కరోనా అనగానే.. లంగ్స్పైనే అది ఎటాక్ చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. నిజమే వైరస్ ముందు ఎటాక్ చేసేది శ్వాసకోశ వ్యవస్థపైనే. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఎక్కువ అవే ఉన్నాయి. అయితే, ఒక్క లంగ్స్పైనే కాదు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థపైనా పెద్ద ప్రభావమే ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో సైటోకైన్స్ (శరీరంలోని కణాలు వివిధ అవయవాలకు సిగ్నల్స్ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించే చిన్న చిన్న ప్రొటీన్లే ఈ సైటోకైన్స్) ఎక్కువగా తయారవడం వల్ల ఆ అవయవాలపై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. దీని వల్ల కరోనా పేషెంట్ కోలుకోవడం ఆలస్యమవుతుందని అంటున్నారు. మరి, ఏయే అవయవాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.
మూత్రపిండాలకు ముప్పు
అమెరికాలోని సగం పేషెంట్లకు మూత్రంలో రక్తం లేదా ప్రొటీన్స్ ఎక్కువగా పోవడాన్ని డాక్టర్లు గుర్తించారు. కిడ్నీలు దెబ్బతిని ఈ సమస్య వచ్చిందని తేల్చారు. న్యూయార్క్లో 14% , వుహాన్లో 30 శాతం మంది పేషెంట్లలో కిడ్నీలు పనిచేయడం ఆగిపోయాయి. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి మాత్రమే వారికి పరిష్కారమని చెబుతున్నారు. అయితే, మూత్రపిండాల కణాలపై వైరస్ దాడి చేస్తుందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు పేషెంట్ల కిడ్నీ కణాల్లో వైరస్ పార్టికల్స్ ఉన్నట్టు మాత్రం గుర్తించారు. దాని వల్ల కిడ్నీలు దెబ్బతిన్నట్టు తేల్చారు.
రక్తంలో గడ్డలు
చాలా మంది పేషెంట్లకు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టిన సమస్యలు ఏర్పడ్డాయి. కొందరిలో రక్తనాళాలు పగిలిపోయి ఆ గడ్డలు ఊపిరితిత్తుల వరకు చేరాయట. కొంతమంది ఈ కారణం వల్లే చనిపోయారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. వుహాన్లోని 80 మంది పేషెంట్లపై స్టడీ చేస్తే 20 మందికి ఇదే సమస్య వచ్చినట్టు తేలింది. అందులో 8 మంది చనిపోయారు. ఈ సమస్యకు విరుగుడుగా న్యూయార్క్ డాక్టర్లు పేషెంట్లకు రక్తాన్ని పలుచన చేసే మందులను ఇస్తున్నారు.
గుండెకు గుబులు
చైనా, న్యూయార్క్లో కరోనా పేషెంట్ల గుండె దెబ్బతిన్నది. అంతేకాదు, గుండె కండరాల్లో వాపు వచ్చి పోటు వచ్చిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా గుండె కొట్టుకునే తీరులోనూ (ఎరిత్మియాసిస్) మార్పులను గుర్తించారు. చైనా పేషెంట్లలో 40 శాతం మందిలో ఎరిత్మియాసిస్, 20 శాతం మందిలో గుండె దెబ్బతిన్న సమస్యలు బయటపడ్డాయి. దీనికి కరోనా వైరసే కారణమా అన్నది మాత్రం డాక్టర్లు తేల్చలేకపోతున్నారు.
కళ్ల కలకలొస్తయ్
కరోనా ఎఫెక్ట్ కళ్లపైనా పడుతోంది. చాలా మంది పేషెంట్లకు కళ్ల కలకల సమస్యలు వచ్చాయి. చైనా హ్యూబెయ్ ప్రావిన్స్లో 38 మంది పేషెంట్లపై స్టడీ చేస్తే అందులో 35 శాతం మందికి ఈ సమస్య ఉంది. వైరస్ కళ్ల నుంచి ఒంట్లోకి చేరడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
డయేరియా ప్రాబ్లం
వైరస్ జీర్ణవ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. చైనాలో సగం మంది కరోనా పేషెంట్లు డయేరియా (అతిసార) సమస్యతో బాధపడినట్టు తేలింది. దాంతో పాటు వాంతుల సమస్య కూడా ఎక్కువగా ఉంది.
లివర్ పాడవుతోంది
అమెరికా, చైనాల్లో కొంత మంది పేషెంట్లకు లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్ వల్ల హెపటైటిస్ సమస్య వచ్చినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
వాసన రాదు.. రుచి తెల్వదు
కరోనా లక్షణాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న కొత్త లక్షణం వాసన పసిగట్టలేకపోవడం, రుచి చూడ లేకపోవడం. రుచి, వాసనకు కారణమయ్యే ఆల్ఫ్యాక్టరీ నరాల ఎండింగ్స్పై వైరస్ ఎటాక్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వాసన పసిగట్టలేమంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆల్ఫ్యాక్టరీ నర్వ్ ఎండింగ్స్ నుంచి నాడీ వ్యవస్థకు మూలమైన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు వెళుతుందట. దీని వల్ల గందరగోళం, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల స్పృహ కోల్పోయే ముప్పు ఏర్పడుతుంది.