- ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
- హైదరాబాద్లోని 156 దవాఖాన్లలో ఏర్పాట్లు
- రెండ్రోజుల్లో 10 వేల మంది కూడా
- స్లాట్ బుక్ చేసుకోలే
- రాష్ట్రంలో 22 లక్షల 78 వేల మంది టీనేజర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీనేజర్స్ (15 నుంచి 18 ఏండ్ల వాళ్లు) కి వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేశామని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని యూపీహెచ్సీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్ రావు ప్రారంభించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సహా మరో 12 కార్పొరేషన్లలో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికే టీకా ఇవ్వనున్నారు. మిగిలిన అన్ని చోట్ల నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఫోన్ నంబర్, ఏదైనా గుర్తింపు కార్డు కంపల్సరీగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. టీనేజర్స్ అందరికీ కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరికీ 0.5 ఎంఎల్ డోసు ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్నాక 30 నిమిషాలు హాస్పిటల్లోనే వెయిట్ చేయాలి. రియాక్షన్స్ రాకపోతే ఇంటికి వెళ్లిపోవచ్చు. ఒకవేళ ఏదైనా రియాక్షన్ వస్తే అక్కడే ట్రీట్మెంట్ అందిస్తారు.
స్లాట్స్ బుక్ చేసుకుంటలె
గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని వ్యాక్సిన్ సెంటర్లలో శనివారం నుంచే వ్యాక్సిన్ రిజిస్ర్టేషన్ ప్రాసెస్ మొదలైంది. నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 22.78 లక్షల మంది టీనేజర్స్ ఉండగా.. రెండ్రోజుల్లో కనీసం పది వేల మంది కూడా స్లాట్ బుక్ చేసుకోలేదు. గాంధీ హాస్పిటల్కు సంబంధించి కనీసం ఐదు మందికి వ్యాక్సిన్ వేయాలని ప్లాన్ చేయగా, ఆదివారం రాత్రి 8 గంటల దాకా ఒక్కరు మాత్రమే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం గమనార్హం. హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు సెంటర్లు కలిపి 118 ఉండగా, దాదాపు అన్ని సెంటర్లకూ అరకొరగానే బుకింగ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రిజిస్ర్టేషన్ లేకుండా నేరుగా (వాక్ ఇన్) వచ్చే వారికీ వ్యాక్సిన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న టీనేజర్స్ కొవిన్ వెబ్సైట్ (https://selfregistration.cowin.gov.in/)లో రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న వారు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు.