ఘట్ కేసర్ ఘటన: ఇంట్లో ఉండలేక కిడ్నాప్ డ్రామా

ఘట్ కేసర్ ఘటన: ఇంట్లో ఉండలేక కిడ్నాప్ డ్రామా

హైదరాబాద్‌ : ఘట్ కేసర్ కేసులో ఫార్మసీ యువతి అందిర్నీ తప్పుదోవ పట్టించిందన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. అమ్మాయి చెప్పినట్లు రేప్, కిడ్నాప్ జరగలేదన్నారు. కిడ్నాప్ లంటే ఆమెకు ఇష్టమని… అంతకుముందు కూడా ఓసారి నాటకమాడిందని తెలిపారు. ఎలాగైనా ఇంట్లోనుంచి బయటపడాలనే స్టోరీ అల్లిందన్నారు. గతంలో చిల్లర విషయంలో తనపై అరిచాడని కోపంతో ఆటో డ్రైవర్ ను కేసులో ఇరికించిందన్నారు. ఆటో డ్రైవర్లకు కేసుతో సంబంధం లేదని… వారందరికీ క్షమాపణ చెప్తున్నా అన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. యువతి ఆడినా డ్రామాకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు సీపీ.

 ఫస్ట్ యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామన్నారు. సెల్ ‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా ట్రేస్‌ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజాలు బయటపడ్డయన్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్న సీపీ.. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని తెలిపారు. తనపై అ‍త్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు తెలిపారు. కిడ్పాప్‌ లేదు, రేప్‌ లేదని.. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. ఆటో డ్రైవర్ తో గతంలో చిల్లర విషయంలో గొడవపడ్డ యువతి..కావాలనే అతడిని ఈ కేసులో ఇరికించిందన్నారు. యువతి కిడ్నాప్‌, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్‌ భగవత్‌ తేల్చిచెప్పారు.

 కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. తర్వాత పోలీసులు విచారించగా ఇదంతా కట్టుకథగా తేలింది.