మధ్యప్రదేశ్ లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14 కు చేరింది. ఈ ప్రమాదంలో మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) డాక్టర్ రాజేష్ రాజోరా తెలిపారు.
సిద్ధి జిల్లా రేవా- సాత్నా సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి అతివేగంతో వచ్చిన ఓ ట్రక్కు టైర్ పగిలిపోవడంతో ఆగి ఉన్న మరో మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బస్సు రెండు ముక్కలయింది. మరో బస్సు నుజ్జునుజ్జు అయింది. మూడు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్ మహాకుంభ్ లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని శివరాజ్ సింగ్ తెలిపారు.