- మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసిన చహర్
- మధ్యలో వైడ్ వేయడంతో హ్యాట్రిక్ మిస్
తిరువనంతపురం: ఇండియా తరఫున తొలి హ్యాట్రిక్ సహా ఇంటర్నేషనల్ టీ20ల్లో బెస్ట్ బౌలింగ్తో రికార్డు సృష్టించిన యువ పేసర్ దీపక్ చహర్.. మూడు రోజుల వ్యవధిలోనే మరో హ్యాట్రిక్ సాధించే చాన్స్ కొద్దిలో కోల్పోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో విదర్భతో మంగళవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్గా బరిలోకి దిగిన దీపక్ (3-–0–18–4) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో వరుసగా మూడు లీగల్ డెలివరీల్లో మూడు వికెట్లు కూడా ఉన్నాయి. కానీ, మధ్యలో ఓ వైడ్ వేయడంతో హ్యాట్రిక్ చేజారింది. వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో విదర్భ వీజేడీ పద్ధతిలో ఒక పరుగు తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 13 ఓవర్లలో 9 వికెట్లకు 99 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి బంతికే రుషభ్ రాథోడ్ (3)ను ఔట్ చేసిన దీపక్.. చివరి మూడు బంతుల్లో దర్శన్ (0), శ్రీకాంత్ వా (13), అక్షయ్ వాడ్కర్ (0)లను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. కానీ, దర్శన్ను ఔట్ చేసిన తర్వాత దీపక్ ఓ వైడ్ వేశాడు. క్రికెట్లో హ్యాట్రిక్కు అధికారికంగా ఎలాంటి వివరణ లేదు. ఒక బౌలర్ వరుసగా మూడు బంతుల్లో (లీగల్ లేదా ఇల్లీగల్) మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్గా పరిగణిస్తారు. ఈ లెక్కన దీపక్ వేసిన వైడ్ బాల్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి అతను హ్యాట్రిక్ మిస్సయ్యాడు. వీజేడీ పద్ధతిలో 107 రన్స్గా లెక్కగట్టిన టార్గెట్ ఛేజింగ్లో రాజస్థాన్13 ఓవర్లలో 8 వికెట్లకు 105 రన్స్ చేసి ఓడింది.
మయాంక్ మిశ్రా హ్యాట్రిక్
విశాఖపట్నంలో గోవాతో జరిగిన మ్యాచ్లో ఉత్తరాఖండ్ బౌలర్ మయాంక్ మిశ్రా (4–0–6–4) హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి గోవా 9 వికెట్లకు 119 రన్స్కే పరిమితమైంది. అనంతరం ఉత్తరాఖండ్ 16.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేజ్ చేసి ఈజీగా గెలిచింది.