ధర్మారెడ్డిది కుల దురహంకారం

ధర్మారెడ్డిది కుల దురహంకారం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లీడర్ల ఫైర్​
  • సారీ చెప్పిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్​రూరల్‍, వెలుగు:  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం ఓసీ సభలో మాట్లాడిన వివాదాస్పద కామెంట్స్​పై కుల సంఘాలు భగ్గుమన్నాయి. ‘అగ్రకులాల వారికి 99 శాతం మార్కులు వచ్చినా ఉద్యోగం రావడంలేదు. అక్షరం ముక్కరానివారు ఉద్యోగాలు పొంది.. అన్ని జిల్లాల్లో అధికారులైతున్రు. ఇయ్యాల రాష్ట్రం మొత్తం నాశనం కావడానికి వాళ్లే కారణం..’ అని ఎమ్మెల్యే మాట్లాడటంపై సోమవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల లీడర్లు హన్మకొండ హరిత కాకతీయ హోటల్​లో మీటింగ్​ పెట్టారు. ధర్మారెడ్డిది కుల దురహంకారమని మండిపడ్డారు.  ఉమ్మడి వరంగల్​తో పాటు పలు జిల్లాల్లో చల్లాకు వ్యతిరేకంగా మీటింగులు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ‘సారీ చెబుతావా.. సంగతి చెప్పమంటావా..’ అని వార్నింగ్​ ఇచ్చారు. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే ఎస్సీ కాలనీల్లో.. లంబాడి తండాల్లో అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేశారు.  దళిత శక్తి ప్రోగ్రామ్​ఆధ్వర్యంలో సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్​ తదితర చోట్ల చల్లా ధర్మారెడ్డి దిష్టి బొమ్మతో రాస్తారోకో చేసి దహనం చేశారు.  దీంతో హైదరాబాద్​ నుంచి హుటాహుటిన వచ్చిన చల్లా తన ఇంట్లో ప్రెస్‍మీట్‍ పెట్టారు. రెండు చేతులు జోడించి క్షమాపణలు అడిగారు.

పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలె

ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్  స్పందించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. చల్లా లాంటి సన్నాసులని, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఇలాంటి వాళ్లని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేస్తున్న సీఎం  కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. చల్లా ధర్మారెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. చల్లా ధర్మారెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జె. చెన్నయ్య, టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్​చేశారు. అతని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

టీఆర్​ఎస్​ వాళ్లను వదిలి బీజేపీ లీడర్లపైనే కేసులు

స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్..తొలిరోజు అటెండెన్స్ 55%

బడ్జెట్ ఎఫెక్ట్: రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద