- ఇకపై 200 చానళ్లలో టీవీ పాఠాలు
- సొంత భాషల్లో వినేందుకు వీలు
- స్కిల్స్ పెంచేందుకు ‘దేశ్’ పోర్టల్
- అర్బన్ ప్లానింగ్ కోసం స్పెషల్ కోర్సు
- 5 యూనివర్సిటీల్లో ప్రారంభం
న్యూఢిల్లీ: చదువులు అందరికీ అందేలా, ఆన్లైన్ క్లాసులు ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా డిజిటలైజేషన్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లలకు పాఠాలు ప్రసారమయ్యే చానళ్లను 200కు పెంచడంతో పాటు స్టూడెంట్లలో స్కిల్స్ను పెంచేందుకు ఓ డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టూడెంట్లందరికీ ప్రపంచ స్థాయి చదువులు అందేలా డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దాని ద్వారా ఇంటి దగ్గర్నే సొంత భాషల్లో చదువుకునేందుకు, నేర్చుకునేందుకు వీలవుతుందన్నారు. ఈ యూనివర్సిటీని ‘హబ్ స్పోక్ మోడల్’లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే యూనివర్సిటీ కేంద్రంగా ప్రతి స్టూడెంట్కు అవసరమైన స్కిల్స్ను నేర్పిస్తామని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలన్నీ దానితో డిజిటల్ యూనివర్సిటీతో కొలాబరేట్ కావొచ్చని ఆమె పేర్కొన్నారు.
అందరికీ అందేలా..
కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాసులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పల్లెల్లో ఉండే స్టూడెంట్లు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాల వారికి టీవీ పాఠాలు మరింత చేరువయ్యేలా ‘పీఎం ఈ–విద్య’లో భాగమైన ‘వన్ క్లాస్ వన్ టీవీ చానల్’ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటిదాకా పాఠాలు చెప్తున్న 12 చానళ్లను 200కు పెంచుతున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి నుంచి 12 వరకు సొంత భాషల్లో పాఠాలు చెప్పేందుకు వీలవుతుందన్నారు. డిజిటల్ టీచర్స్ ద్వారా అత్యంత నాణ్యమైన ఈ–కంటెంట్ను స్టూడెంట్లకు అందించేందుకు వీలవుతుందన్నారు. మొబైల్ ఫోన్లు, టీవీ, రేడియోల ద్వారా కంటెంట్ను అందించొచ్చన్నారు.
‘దేశ్’ పోర్టల్
స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్(ఎన్ఎస్ క్యూఎఫ్)తో విద్యా, ఉపాధి రంగాన్ని అనుసంధానిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకోసం డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్– (ద దేశ్ స్టాక్ పోర్టల్)ను ప్రారంభిస్తామన్నారు. ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా ప్రజలు, స్టూడెంట్లలో స్కిల్స్ను పెంచుతామని చెప్పారు. దాంతో పాటు సైన్స్ అండ్ మ్యాథ్స్ కోసం 750 వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సిమ్యులేటెడ్ లెర్నింగ్ కోసం 75 స్కిల్లింగ్ ఈ–ల్యాబ్స్ను అందుబాటులోకి తెస్తామని ఆమె ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా డ్రోన్ల వాడకాన్ని పెంచేందుకుగానూ ‘డ్రోన్ శక్తి’ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఐటీఐల్లో స్కిల్ కోర్సులను ప్రారంభిస్తామన్నారు.
ఎడ్యుకేషన్ సెస్.. బిజినెస్ ఎక్స్పెండిచర్ కాదు
వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమీకరణ కోసం మాత్రమే ‘హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్’ను సర్చార్జీలాగా వసూలు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చట్టంలోని రూల్స్ ప్రకారం ఆదాయం లేదా లాభాలపై విధించే ఏదైనా సర్చార్జ్గానీ, సెస్ గానీ బిజినెస్ ఎక్స్పెండిచర్ కిందకు రాదని తేల్చి చెప్పారు.
అర్బన్ ప్లానింగ్ కోర్సు
మన దేశ అవసరాలకు తగ్గట్టు పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయడం కోసం ఐదు యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అర్బన్ ప్లానింగ్ కోర్సును తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ యూనివర్సిటీలకు రూ.250 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తామన్నారు. కోర్సుకు సంబంధించిన సిలబస్, నాణ్యత, ఇతర విద్యాసంస్థల్లో ప్లానింగ్ కోర్సుల ప్రారంభం వంటి విషయాలను చూసుకునే అధికారాలను ఏఐసీటీఐకి ఇస్తున్నట్టు చెప్పారు.