లాక్డౌన్ వల్ల ఈ కార్పెంటర్ షాప్ మూతపడింది. ఎప్పుడూ చేతినిండా పనితో క్షణం తీరిక లేకుండా ఉండే ఇతనికి ఏం చేయాలో తెలియనంత ఖాళీ టైం దొరికింది. మొదటి రెండుమూడు రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపాడు. కానీ, తర్వాత మెల్లిగా బోర్ మొదలైంది. దాంతో డిఫరెంట్గా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే.. నాలుగు నెలల్లో చెక్కతో సైకిల్ని తయారుచేశాడు. ఇప్పుడీ సైకిల్కి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చింది. ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ కార్పెంటర్ ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎకో ఫ్రెండ్లీ సైకిల్తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ కార్పెంటర్ పేరు ధని రామ్ సగ్గు. పంజాబ్లోని జిర్ఖాపూర్ ఈ కార్పెంటర్ సొంతూరు. మార్చి 24 లాక్ అనౌన్స్ చేయడంతో షాప్ కట్టేసి అప్పట్నుంచి ఇంటికే పరిమితమయ్యాడు ధనిరామ్. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఇంట్లోని పాత చెక్కలు, రంపం మిషీన్, రెంచీలు, అన్నింటిని ఒకచోట చేర్చి సైకిల్ తయారీ మొదలుపెట్టాడు. మొదటి రెండుమూడు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే వెనకడుగేయకుండా మళ్లీ ప్రయత్నించి చెక్కతో ఎకో ఫ్రెండ్లీ సైకిల్ తయారుచేశాడు. మరుసటి రోజే 15000 చేతికిచ్చి ఆ సైకిల్ని కొనుక్కెళ్లాడు ఓ కస్టమర్. మరిన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఏదో టైంపాస్ కోసం చేసిన ప్రయత్నం అందరికీ నచ్చడంతో మరిన్ని సైకిల్స్ తయారుచేశాడు ధనిరామ్. ప్రస్తుతం కెనడా లాంటి దేశాలకి కూడా తన ఎకో ఫ్రెండ్లీ సైకిల్స్ని ఎగుమతి చేస్తున్నాడు ఈ కార్పెంటర్.