బ్యాంకులకు డేంజర్‌ బెల్‌!

బ్యాంకులకు డేంజర్‌ బెల్‌!

న్యూఢిల్లీ: పెద్ద బ్యాంకులకు గడ్డు రోజులు ముందున్నాయని ఫైనాన్షియల్​ ఎక్స్​పర్టులు అంటున్నారు. గూగుల్‌‌పే, ఫోన్‌‌పే, పేటీఎం వంటి డిజిటల్‌‌ వాలెట్లు కూడా డిపాజిట్లు తీసుకోవడం మొదలుపెట్టడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇది బ్యాంకులకు గొడ్డలి పెట్టులాంటిదని హెచ్చరిస్తున్నారు. మనదేశంలో అత్యధిక యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్న ప్లాట్‌‌ఫారాల్లో గూగుల్‌‌పే ఒకటి. ఇక నుంచి ఇది చిన్న బ్యాంకుల కోసం తన యూజర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటోంది. చిన్న బ్యాంకులకు పెద్దగా బ్రాంచ్‌‌లు ఉండవు కాబట్టి ఇవి బిజినెస్‌‌ను పెంచుకునేందుకు గూగుల్‌‌ వంటి పెద్ద కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి. ఈక్విటాస్‌‌ స్మాల్‌‌ ఫైనాన్స్‌‌ బ్యాంక్‌‌, డిపాజిట్లు తీసుకోవడానికి గూగుల్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. గూగుల్‌‌పే ద్వారా వచ్చే ఏడాది టెనార్‌‌ కలిగిన డిపాజిట్లకు 6.85 శాతం వడ్డీ ఇస్తామని ఈ బ్యాంకు ప్రకటించింది. ఇతర స్మాల్‌‌ ఫైనాన్స్‌‌ బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాయి. గూగులే కాదు ఫేస్‌‌బుక్‌‌ కూడా చిన్న వ్యాపారులకు లోన్లు ఇవ్వడానికి కొన్ని ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్‌‌ యూపీఐతోపాటు చిన్న లోన్లు (పే లేటర్‌‌) ఇస్తోంది. వాట్సాప్‌‌ సైతం యూపీఐ సేవలు అందిస్తోంది. ఇలాంటి మల్టీనేషనల్‌‌ కంపెనీలు ఆన్‌‌లైన్‌‌ ద్వారా ఫైనాన్షియల్‌‌ ప్రొడక్టులను అందజేయడం వల్ల సంప్రదాయ బ్యాంకులకు కచ్చితంగా నష్టం ఉంటుంది. అంతేకాదు చాలా ఫిన్‌‌టెక్‌‌ స్టార్టప్‌‌లు ఆన్‌‌లైన్‌‌లో నేరుగా లోన్లు ఇస్తున్నాయి. ఈ పరిస్థితి పెద్ద బ్యాంకులకు కూడా ఇబ్బందికరమే.  

చైనాయే ఉదాహరణ...

చైనా ఫిన్‌‌టెక్‌‌ స్టార్టప్‌‌లు అక్కడి సంప్రదాయ బ్యాంకింగ్‌‌ను దెబ్బకొట్టాయి. ఇవే సొంతంగా లోన్లు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడంతో మామూలు బ్యాంకులపై పెద్ద ఎఫెక్టే పడింది. దీంతో డ్రాగన్‌‌ ప్రభుత్వం వీటిపై రిస్ట్రిక్షన్లు విధించింది. ఫలితంగా ఇవన్నీ ఇప్పుడు ఇండియావైపు చూస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన షావోమీ గ్రూపు తన ‘మీ పే యాప్‌‌’ ద్వారా భారీగా లోన్లు ఇస్తోంది. బిల్‌‌ పేమెంట్స్‌‌, యూపీఐ ట్రాన్సాక్షన్స్‌‌ వంటి ఎన్నో సేవలు అందిస్తోంది. కేవైసీ వంటి పనులన్నింటినీ ఆన్‌‌లైన్‌‌లోనే చేసుకునే అవకాశాలు ఉండటంతో జనం బ్యాంకు క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం ఉండటం లేదు. ఫిన్‌‌టెక్‌‌ కంపెనీ యాప్స్‌‌లో నిమిషాల్లో వాలెట్‌‌, యూపీఐ ఐడీలను క్రియేట్‌‌ చేసుకోవచ్చు. బ్యాంకుల వెబ్‌‌సైట్స్‌‌/యాప్స్‌‌తో కంటే యూపీఐ, వాలెట్ల ద్వారా డబ్బును పంపడం సులువు అయింది. అందుకే గూగుల్‌‌పే, ఫోన్‌‌పే ఇండియాలో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు యాప్స్‌‌ ద్వారా గత నెలలోనే రూ.ఐదు లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయంటే వీటి హవా ఎలా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్‌‌ యూపీఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వీటి కస్టమర్లలో సగం మందైనా ఈ ప్లాట్‌‌ఫామ్‌‌కు వస్తారనే అంచనాలు ఉన్నాయి. బ్యాంకులకు ఉన్న మరో సమస్య ఏమిటంటే.. పోటీలో నిలదొక్కుకోవాలంటే వడ్డీరేట్లు ఎక్కువగా ఇవ్వాలి. ఈక్విటాస్ మాదిరిగా వడ్డీరేటు ఇచ్చిన బ్యాంకుల్లోనే జనం డిపాజిట్‌‌ చేస్తారు. ఎక్కువ వడ్డీ ఇస్తే బ్యాంకు బ్యాలన్స్‌‌షీటు బలహీనమవుతుంది. ఈ పరిస్థితి రావొద్దంటే ప్రభుత్వ బ్యాంకులు గూగుల్‌‌, ఫేస్‌‌బుక్‌‌, అమెజాన్‌‌ను అడ్డుకోవడానికి లాబీయింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. 

ఇవన్నీ ఇలా ఉంటే.. ఫేస్‌‌బుక్ ప్రాజెక్ట్‌‌ డియెమ్‌‌తో బ్యాంకులన్నింటికీ ఇక్కట్లు తప్పకపోవచ్చు. సాధారణ కరెన్సీగా బదులు తమ డిజిటల్‌‌ కరెన్సీ వాడుకోవచ్చని, ప్రపంచమంతటా ఇది అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇలాంటి వాటి వల్ల బ్యాంకుల బిజినెస్‌‌ దెబ్బతినొచ్చనేది ఎక్స్‌‌పర్టుల మాట. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలు సాధారణ బ్యాంకులపై ముప్పేట దాడి చేస్తున్నాయి.