సెంటిమెంట్ పేరుతో ఇంకెంత‌కాలం మోసం చేస్తారు?

సెంటిమెంట్ పేరుతో ఇంకెంత‌కాలం మోసం చేస్తారు?

సెంటిమెంట్ పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి డీకే అరుణ‌. పోతిరెడ్డిపాడు పై కేసీఆర్ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. పోతిరెడ్డిపాడు పై సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వ‌హించిన డీకే అరుణ‌.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై జగన్ కు కేసీఆర్ కు ముందే ఒప్పందం కుదిరింది నిజం కాదా ?. అని అడిగారు. పాలమూరు ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తార‌‌ని అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీటిని తీసుకుపోతున్నా.. కమిషన్ ల కోసమే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడన్నారు. అద‌న‌పు నీటిని తీసుకుపోకుండా ఆపే శక్తి కేసీఆర్‌కు ఉందా? అని అరుణ ప్ర‌శ్నించారు.

ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేద‌ని ఆమె అన్నారు. పాత ప్రాజెక్టులకే పేరు మార్చి తానే నిర్మించానని సీఎం చెప్పుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీసీ, ఏఎమ్ఆర్‌పీ ప్రాజెక్టులకు భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ భేషజాలు పోకుండా త‌మ సూచనలను పరిగణలోకి తీసుకోవాల‌న్నారు.

పాలమూరు-రంగారెడ్డి కి జూరాల నుంచి 5 టిఎంసిలు, నార్లపూర్ ప్రాజెక్ట్ నుంచి మూడు టీఎంసీలను 30 రోజుల్లో నే నీళ్లు డ్రా చేయాలని, కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు లకు వేరువేరుగా నీటిని డ్రా చేయాలని అరుణ అన్నారు. పోతిరెడ్డిపాడు కు గతంలో 12 టిఎంసిల నీటిని ఏపీ కి తరలించారని, అదనంగా ఇప్పుడు మ‌రో మూడు టీఎంసీలు తరలించేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. నీటి కేటాయింపుల వాటా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారన్నారు. 203 జీవోను అడ్డుకునే శక్తి కేసీఆర్ కు ఉందా అని అడిగారు.

కడుపు కాలిన పాలమూరు రైతుల గోస ను పట్టించుకోవాల‌ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాల‌ని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే ల అసమర్థత కారణంగానే జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని డీకే అరుణ విమ‌ర్శించారు.