V6 News

రికార్డు స్థాయిలో 'దృశ్యం 3' బిజినెస్.. మోహన్‌లాల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

రికార్డు స్థాయిలో 'దృశ్యం 3' బిజినెస్.. మోహన్‌లాల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు 'దృశ్యం' ఒక ఎమోషన్. కేవలం మలయాళంలోనే కాకుండా, భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ట్రెండ్‌ను మార్చేసిన ఘనత ఈ ఫ్రాంచైజీది. సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చట్టం కళ్లకు గంతలు కట్టి ఆడే మైండ్ గేమ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఈ క్రేజీ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ రాబోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.

రూ. 100 కోట్ల భారీ డీల్

మలయాళ సినిమా మార్కెట్ పరిధిని అమాంతం పెంచుతూ.. ‘దృశ్యం 3’ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఏకంగా రూ. 100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పనోరమా స్టూడియోస్ ద్వారా ఆశీర్వాద్ సినిమాస్‌లో ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది. ఒక ప్రాంతీయ సినిమాకు, అదీ మలయాళం వంటి పరిమిత మార్కెట్ ఉన్న భాషలో విడుదలకు ముందే ఇంత భారీ డీల్ కుదరడం ఒక రికార్డు. జార్జ్‌కుట్టి పాత్రకు ఉన్న పాపులారిటీ, దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్‌ప్లేపై ఉన్న నమ్మకమే ఈ పెట్టుబడికి ప్రధాన కారణంగా సినీ వర్గాలు చెబుతున్నాయి..

 

మరోసారి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా..

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూడో భాగంలో మోహన్‌లాల్ సరసన మీనా మరోసారి నటించింది. మొదటి రెండు భాగాల్లో పోలీస్ కేసుల నుంచి తృటిలో తప్పించుకున్న జార్జ్‌కుట్టి ఫ్యామిలీ, ఈసారి ఎలాంటి చిక్కుల్లో పడబోతుంది? గతాన్ని పోలీసులు మళ్ళీ వెలికితీస్తారా? అనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇప్పటికే మొదటి రెండు భాగాలు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ మూడో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ALSO READ : నితిన్ కొత్త ప్రయోగం..

రిలీజ్ ఎప్పుడంటే?

అన్ని కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేసిన మేకర్స్, ఈ భారీ చిత్రాన్ని 2026 మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. కేవలం మలయాళంలోనే కాకుండా, దీనిని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేసే అవకాశం ఉంది. జార్జ్‌కుట్టి ఆడే మూడో మైండ్ గేమ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే.