హైదరాబాద్ : 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కోసం ఆర్ టి ఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా తమకు 8 ఛార్జీ షీట్ల వివరాలు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు.
ఈ వ్యవహారంలో 12 కేసులు నమోదు అయ్యాయని… కానీ పోలీసులు 8 కేసుల్లో మాత్రమే ఛార్జ్ షీట్ నమోదు చేయడం పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మిగిలిన 4 కేసుల్లో ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులు నమోదైన సమయంలో మా అసోసియేషన్ ముఖ్యమంత్రిను కలిసారని… ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా ఉండేందుకు వారు ముఖ్యమంత్రిను కోరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని… అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.