పాడ్‌కాస్ట్‌లతో అలరిస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్

పాడ్‌కాస్ట్‌లతో అలరిస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్

ఆకట్టుకుంటున్న మేరా భారత్ మహాన్ పాడ్‌కాస్ట్‌

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. మళ్లీ మూవీ షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా రిస్క్ ఎందుకని బడా ఫిల్మ్ మేకర్స్ సినిమా షూటింగులకు తాత్కాలిక విరామం ఇచ్చారు. దేవరకొండ విజయ్‌తో పూరి తీస్తున్న సినిమా షూటింగ్‌కు కూడా బ్రేక్ పడింది. దీంతో ప్రేక్షకులను తన పాడ్‌కాస్ట్‌లతో పూరి ఎంటర్‌‌టైన్ చేస్తూ ఆలోచింపజేస్తున్నాడు. జూలైలో పూరి మ్యూజింగ్స్‌ పేరుతో మొదలైన ఈ సిరీస్‌ వరుస పాడ్‌కాస్ట్‌తో కొనసాతూ ప్రేక్షకులను అలరిస్తోంది. స్త్రీ పేరుతో చేసిన ఎపిసోడ్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్‌ ఇచ్చాడు. తాజాగా దేశభక్తిపై పూరి ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్‌ చేశాడు. మేరా భారత్ మహాన్ పేరుతో రిలీజైన ఈ పాడ్‌కాస్ట్‌లో మన దేశం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు. కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం అంటూ ఈ పోడ్‌కాస్ట్‌ ఆరంభమవుతుంది.

‘భారతదేశం కర్మభూమి. కానీ మనకు కామన్‌సెన్స్ ఉండదు.
మనది వేద భూమి. ఆ వేదాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు.
ఇది పుణ్యభూమి. మన చేయని పాపం లేదు.
మన తల్లి భరతమాత. కానీ గంటకో రేప్ చేస్తుంటాం.
సువిశాల భారత ఖండం. పాపులేషన్‌తో కిటకిటలాడి చస్తుంటాం.
గంగ, యమున, గోదావరి ఆ నీళ్ల కోసమే కొట్టుకు చస్తుంటాం.
ఎన్నో పుణ్య క్షేత్రాలు.. ఆ గుళ్ల బయటే చెప్పులు దొంగిలిస్తుంటాం.
మహా కవులు పుట్టిన దేశం మనది.. 65 శాతం నిరక్షరాస్యత.

మనది ఆర్య సంస్కృతి.. అందుకే పెట్రోల్‌లో కిరోసిన్ కలిపేస్తుంటాం. పాలల్లో నీళ్లు కలిపేస్తాం. మునిసిపాలిటీ నీళ్లు లాగేస్తాం. రేషన్ బియ్యం బయట అమ్మేస్తాం. ఓట్లు అమ్ముకుంటాం. దొంగ బిల్స్ పెడతాం. బిల్స్ ఎగ్గొడతాం. దొంగ సర్టిఫికేట్లు పెడతాం. దొంగ నోట్లు గుద్దేస్తాం. టిక్కెట్ లేకుండా ట్రెయిన్ ఎక్కేస్తాం. పక్క స్థలం కలిపేస్తాం. ఆఖరికి డ్రైనేజీ మూతలు కూడా అమ్మేస్తాం అంటూ సాగిన ఈ పాడ్‌కాస్ట్‌ ఆలోచింపజేస్తోంది. సైనికులు దేశం దేశం అంటూ జాతి గౌరవంతో చనిపోయారు. మేరా భారత్ మహాన్‌ వాళ్ల కోసమైన చీప్ పనులు ఆపేద్దాం. కనీసం రోడ్ల మీద మూత్ర విసర్జన చేయకపోతే చాలు.. అది కూడా దేశభక్తే. జనగణమన అంటూ మెసేజ్ ఇస్తూ ఈ పోడ్‌కాస్ట్‌ను ముగించాడు.