రూ. 2నోటును ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ నోటుకు చిల్లర విడిపించుకోవడానికి ప్రజలు నానా తంటాలుపడుతున్నారు. కొన్ని షాపుల్లో రూ.2వేల నోట్లను తీసుకోవడం లేదు. పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది రూ. 2 వేల నోటుతో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని పెట్రోల్ బంక్ నిర్వహకులు వాపోతున్నారు. అటు రూ. 2వేల నోట్లపై క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయని జోమాటో తెలిపింది. రూ.2000 నోటుతో 70 శాతం బిల్లు చెల్లిస్తున్నారని పేర్కొంది.
అయితే ఈ గందరగోళ పరిస్థితిని ఓ ఢిల్లీ బిజినెస్మెన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఢిల్లీలోని జీటీబీ నగర్కు చెందిన ఓ బిజినెస్మెన్ రూ.2వేల నోటుకు సంబంధించి బంఫర్ ఆఫర్ను ప్రకటించారు. రూ.2వేల నోటుతో కొనుగోలు చేస్తే రూ.2100 విలువైన వస్తువులు ఇస్తునట్లుగా తన దుకాణం ముందు బోర్డు పెట్టాడు.
దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతని షాపుకు జనాల క్యూ కడుతున్నారు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్బీఐ తనను తాను తెలివైందిగా భావిస్తే ఢిల్లీ ప్రజలు అంతకంటే తెలివైనవారని కామెంట్ చేస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19 శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. నోట్ల మార్పిడికి 2023 సెప్టెంబర్ 30వరకు అవకాశాన్ని కల్పించింది. బ్యాంకులతో పాటుగా దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది ఆర్బీఐ.