రాత్రి డ్యూటీకి వెళ్లిన భర్త.. తెల్లారేసరికి వాకిట్లో శవమయ్యాడు

రాత్రి డ్యూటీకి వెళ్లిన భర్త.. తెల్లారేసరికి వాకిట్లో శవమయ్యాడు

చిట్యాల, వెలుగు: తెల్లవారుజామున వాకిలి ఊడ్చేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చిన భార్యకు గుమ్మం ముందు భర్త శవం కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఇసుక ట్రాక్టర్ కూలికి వెళ్లిన తన భర్త రక్తపు మరకలతో ఇంటిముందు శవమై పడిఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యింది. భూపాలపల్లి మండలం నేరేడుపల్లిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరవేణి రవి(32)ని ఇదే గ్రామానికి చెందిన సుంకరి ప్రశాంత్​రెడ్డి, మూగ రాజు, పొన్నం రాకేశ్​బుధవారం రాత్రి ఇసుక ట్రాక్టర్​పై కూలీకి తీసుకెళ్లారు.

చిట్యాల మండలంలోని కాల్వపల్లి శివారు మానేరువాగులో అక్రమంగా ఇసుక లోడ్ చేసుకుని రాత్రి 12గంటలకు తిరిగి వస్తుండగా ట్రాక్టర్​ కుదుపులకు మడుగర్​పై కూర్చున్న రవి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. భయబ్రాంతులకు గురైన ట్రాక్టర్ లో ఉన్నవాళ్లు గురువారం తెల్లవారకముందే రవి మృతదేహాన్ని నేరేడుపల్లికి తీసుకెళ్లి అతని ఇంటిముందు వదిలి వెళ్లిపోయారు. ఉదయం అతని భార్య అనిత లేచి వాకిట్లోకి రాగానే భర్త రవి డెడ్​బాడీ కనిపించడంతో షాక్ తో కేకలు వేయగా చుట్టుప్రక్కల వారు వచ్చి పరిస్థితిని చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. ఈలోగా మృతుడి బంధువులంతా కలిసి రవిని కూలీకి తీసుకెళ్లిన వారిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. తన భర్త మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.