ఐసోలేషన్ పేరుతో ఇబ్రహీంపట్నం గురుకుల స్కూల్ మేనేజ్ మెంట్ నిర్వాకం
- పాడుబడ్డ బిల్డింగ్లోకి పిల్లలను తరలించి రూమ్కు ఒకరు, ఇద్దరు చొప్పున ఐసోలేట్
- మరింతగా భయపడుతున్న స్టూడెంట్లు
ఇబ్రహీంపట్నం, వెలుగు : కండ్ల కలక సోకిన పిల్లలను ఐసోలేషన్ పేరుతో ఓ గురుకుల స్కూల్ మేనేజ్ మెంట్ వారిని చీకటి గదులకు తరలించింది. వారి అత్యుత్సాహం పిల్లలను మరింత భయాందోళనకు గురయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురుకుల స్కూల్, జూనియర్ కాలేజీలో 570 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వారం రోజుల్లో 50 మంది స్టూడెంట్లకు కండ్ల కలక సోకింది. ప్రతిరోజు డాక్టర్లు వచ్చి స్టూడెంట్లకు టెస్టులు చేస్తున్నారు. అయితే, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు, సిబ్బంది అత్యుత్సాహంతో కండ్లకలక సోకిన పిల్లలను ఐసోలేషన్ పేరు చెప్పి దగ్గరలోని పాడుబడిన బిల్డింగ్కు తరలించారు.
వాడుకలో లేని చీకటి గదుల్లో రూమ్కు ఒకరు, ఇద్దరిని చొప్పున ఐసోలేట్ చేశారు. దీంతో స్టూడెంట్లు మరింత భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్యూఐ నేతలు శనివారం రాత్రి గురుకుల స్కూల్ను సందర్శించారు. చీకటి గదుల్లో స్టూడెంట్లను ఉంచడంపై ఆందోళనకు దిగారు. రాత్రి వేళ విడిగా ఉంచకుండా, వారు భయపడకుండా చూడాలని కోరారు. కండ్ల కలక సోకిన పిల్లలందరినీ ఒకే డార్మిటరీకి తరలిస్తామని మేనేజ్ మెంట్ పేర్కొంది.