Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక

Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు  (  మే 3 నుంచి) రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

 ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగాల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికలు జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం  ( మే 2) నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూరు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి.  తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే నెల ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవారం మే నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది.తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.