సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఈ క్రమంలో సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన మెమోలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్పై బూడిద, ఎముకలు, అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీని గుర్తించి సీజ్ చేసినట్లు కోర్టుకి మెమోలో పేర్కొంది సిట్.
కస్టడీలోనే తీవ్ర గాయాలతో సాయికృష్ణ మృతి చెందినట్లు కొందరి స్టేట్మెంట్ల ఆధారంగా గుర్తించామని వెల్లడించింది సిట్. మాజీ సీఐ నాగరాజుని కస్టడీకి అనుమతిస్తే.. మృతదేహాన్ని ఏం చేశారు అనే విషయంపై క్లారిటీ వస్తుందని కోర్టుకు తెలిపింది సిట్. సాయికృష్ణ డెడ్ బాడీని ఏం చేశారన్నది నాగరాజు నోరు విప్పితేనే తెలుస్తుందని... అతన్ని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది సిట్.
ఈ క్రమంలో సిట్ కస్టడీలో నాగరాజు నోరు విప్పుతాడా..ఈ కేసులో ఇతర పోలీసుల పాత్రపై రివీల్ చేస్తాడా అన్నది ఉత్కంఠగా మారింది. నాగరాజు కస్టడీ వేళ సిట్ మెమోలో సంచలన విషయాలు బయటపడటం హాట్ టాపిక్ గా మారింది.
