తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC) కొన్ని సీన్లను కట్ చేయాలన్న షరతుతో బుధవారం 'ఎ' (A) సర్టిఫికెట్ జారీ చేసింది. కట్ చేయాల్సిన సీన్ల లిస్టును సెన్సార్ బోర్డు త్వరలో వెబ్సైట్లో పెడుతుంది. తుది సర్టిఫికెట్ వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాను జూలై 24 లేదా జూలై 31న థియేటర్లలో భారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తుది సర్టిఫికెట్ రాగానే అధికారిక ప్రకటన రానుంది.
సినిమా ఎందుకు ఆలస్యమైంది
నిజానికి ఈ సినిమా గత ఏడాది చివర్లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. 2025 డిసెంబర్లోనే సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని మార్పులు సూచించి సినిమాకు ఓకే చెప్పారు. దీంతో 2026 జనవరి 9న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ ట్విస్ట్ ఏంటంటే.. మొదట ఓకే చెప్పిన సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒకరు, ఆ తర్వాత సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం చెబుతూ సీబీఎఫ్సీ ఛైర్మన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదు చేశారు. దీంతో సినిమాను రీరివ్యూ కోసం మళ్లీ రివైజింగ్ కమిటీకి పంపాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో ఆలస్యం తట్టుకోలేక డైరెక్టర్ మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కూడా సర్టిఫికెట్ రావడంలో లేట్ అయింది.
టైటిల్ కార్డ్ మార్చాలని డిమాండ్
సినిమా ఆలస్యం కావడంపై 'జన నాయగన్' నిర్మాత (కేవీఎన్ ప్రొడక్షన్స్) వెంకట్ కె నారాయణ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
"సినిమా టైటిల్ కార్డ్ మీద 'దళపతి విజయ్' అని కాకుండా.. 'తమిళనాడు ముఖ్యమంత్రి' అని వేయాలని అభిమానులు కోరుతున్నారు. నిజానికి సినిమా మొదలుపెట్టినప్పుడు విజయ్ గారు సీఎం అవుతారని మాకు తెలియదు. ఆయన నిజంగానే ముఖ్యమంత్రి అయ్యాక, ఒక నిజమైన 'జన నాయగన్'గా ఈ సినిమా విడుదల కావడం ఒక అద్భుతమైన విషయం. ఇది విధి రాత ఏమో!" అని నిర్మాత వెంకట్ సంతోషం వ్యక్తం చేశారు.
ALSO READ : ‘మాలీవుడ్ టైమ్స్’ ఓటీటీ రివ్యూ..
"సినిమా అసలు రిలీజ్ కాకముందే ఫిర్యాదు ఎలా వస్తుందని మేం కోర్టుకు వెళ్లాం. తీరా చూస్తే మొదట ఓకే చెప్పిన సెన్సార్ సభ్యుడే కంప్లైంట్ చేశాడని తెలిసింది. అందుకే మళ్లీ రివైజింగ్ కమిటీకి వెళ్లి అప్రూవల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది రాగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
