దేశ పౌరులను బానిసలుగా చేస్తున్నారా.. అమిత్ షా డౌన్ డౌన్ అంటే తప్పేముందీ : ముంబై హైకోర్టు వ్యాఖ్యలు

దేశ పౌరులను బానిసలుగా చేస్తున్నారా.. అమిత్ షా డౌన్ డౌన్ అంటే తప్పేముందీ : ముంబై హైకోర్టు వ్యాఖ్యలు

రాజకీయ నాయకులను, కార్యకర్తలను సిటీ నుంచి బ్యాన్ చేయడంపై ముంబై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయకులను విమర్శించడం, వారికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించింది. పౌరులను బానిసలుగా మార్చాలని చూస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది బాంబే హైకోర్టు. 

శాంతియుత నిరసనలు చేసినందుకు పొలిటికల్ యాక్టివిస్ట్ పై ముంబై పోలీసులు విధించిన సిటీ బ్యాన్ ఆజ్ఞలను  హైకోర్టు శుక్రవారం (జులై 03) రద్దు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ మాధవ్ జె. జామ్దార్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ప్రభుత్వ బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు.  ప్రజలు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, నిరసనలు చేయడం రాజ్యాంగపరమైన హక్కు అని స్పష్టం చేశారు. 

పోలీసులు ప్రజా సేవకులే కానీ, నేతలు, ప్రభుత్వ అధికారుల సేవకులు కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జనరల్ సెక్రటరీగా ఉన్న సయీద్ అహ్మద్ అబ్దుల్ వహీద్ చౌదరిపై  2019 నుంచి 2024 వరకు వివిధ కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 2025లో ముంబై పోలీసులు ఒక సంవత్సరం సిటీ నుంచి బహిష్కరించారు. 

 CAA, NRC, బాబ్రీ మసీదు, జ్ఞానవాపి మసీదు వంటి వివాదాస్పద అంశాలపై అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం, BJP ప్రభుత్వం ముర్దాబాద్, అమిత్ షా ముర్దాబాద్ వంటి నినాదాలు చేయడం మొదలైన ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.  రాబోయే సివిక్ పోల్స్ లో  తనను దూరం చేయడానికి, వ్యతిరేక గొంతుకను అణచివేయడానికి చేసిన రాజకీయ కుట్ర ఈ కేసు అని చౌదరి వాదించారు. 

ALSO READ : అయోధ్య రామాలయంలో దొంగతనం దురదృష్టకరం

చౌదరి తరఫు న్యాయవాదుల  వాదనలను అంగీకరించిన జస్టిస్ జామ్దార్, పోలీసుల చర్యలు దురుద్దేశపూర్వకమైనవని అన్నారు.  రాజ్యాంగం ఆర్టికల్ 19, 21 కింద ప్రజలకు వ్యక్తి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు ఉందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి ముఖ్యమని హైకోర్టు నొక్కి చెప్పింది.ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.