రాష్ట్రంలో మే నుంచి ఎన్పీఆర్

రాష్ట్రంలో మే నుంచి ఎన్పీఆర్
  • ఏప్రిల్​ తర్వాత ఎప్పుడైనా చేపట్టేలారాష్ట్రాలకు చాన్సిచ్చిన కేంద్రం
  • మన దగ్గర ఎండాకాలం సెలవుల్లో ఇండ్ల లెక్కింపు’ చేసే యోచన
  • 2021 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు
  • అవసరమైన సిబ్బంది, ఇతర ఏర్పాట్లలో అధికారులు

ఎన్పీఆర్ ప్రక్రియ తొలిదశలో ‘ఇండ్ల లెక్కింపు’ను ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ మధ్య ఎప్పుడైనా చేపట్టేలా రాష్ట్రాలకు కేంద్రం అవకాశమిచ్చింది. ఈ ప్రోగ్రాంలో సమాచారం సేకరించే ఎన్యుమరేటర్లంతా టీచర్లే కావడంతో.. ఎండాకాలం సెలవుల్లో నిర్వహించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కలు చేపట్టనున్నారు.

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్​ (ఎన్పీఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మే నుంచి ‘నివాసాల లెక్కింపు’ మొదలుకానుంది. ఈ ప్రోగ్రాంలో ఎన్యుమరేటర్లుగా టీచర్లే ఉండే నేపథ్యంలో ఎండా కాలం సెలవుల్లో చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్​ నుంచే ఎన్పీఆర్​ తొలిదశను ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రాలు ఏప్రిల్​ నుంచి సెప్టెంబర్​ మధ్య ఎప్పుడైనా 45 రోజుల టైం పీరియడ్​లో తొలిదశను పూర్తి చేసేందుకు కేంద్ర సర్కారు వీలు కల్పించింది. ఆ సమాచారం ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జన గణన చేపట్టనుంది. దీనికి సంబంధించి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్​రాయ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్​లు, సెన్సస్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందులో తెలంగాణ నుంచి సెన్సస్ డైరెక్టర్ ఇలంబర్తి, జీఏడీ కార్యదర్శి కిషన్, తెలంగాణ భవన్ రెసిడెంట్​ కమిషనర్​ గౌరవ్ ఉప్పల్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్​రాయ్​ 2021 సెన్సస్ అధికారిక మస్కట్​ను ప్రారంభించి మాట్లాడారు. సెన్సస్​ నిర్వహించాల్సిన అవసరాన్ని, అమల్లో రాష్ట్రాల పాత్రను వివరించారు. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ డాక్టర్ వివేక్ ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

స్కూళ్ల సెలవుల టైంలో..

రాష్ట్రంలో మే నుంచి తొలిదశ ఎన్పీఆర్​ ప్రారంభమయ్యే అవకాశముంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇండ్లు (నివాసాలు) లెక్కిస్తారు. డివిజన్, మండలం, గ్రామ స్థాయిలో నివాసాల వివరాలను నమోదు చేస్తారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే ఎన్యుమరేటర్స్ గా టీచర్లే ఉంటారని, అందువల్ల ఎండాకాలం సెలవుల సమయంలో ఈ ప్రక్రియ చేపట్టవచ్చని రాష్ట్రానికి చెందిన ఒక కీలక అధికారి చెప్పారు. అంటే మేలో మొదలయ్యే చాన్సుందని తెలిపారు. రాష్ట్రంలో గత పదేండ్లలో కొత్తగా వందలాది కాలనీలు వెలిశాయని, మల్టీ స్టోరేజీ భవనాల నిర్మాణం పెరిగిందని చెప్పారు. ఈ వివరాలన్నీ సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారం ఆధారంగా 2021లో సెన్సస్​ చేపడతారని.. అప్పుడు కూడా టీచర్లు ఎన్యుమరేటర్లుగా, డివిజన్ ఇన్​చార్జులుగా పైఅధికారులు ఉంటారని వివరించారు.