ఢిల్లీలో ఆప్ జైల్‌ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన

ఢిల్లీలో ఆప్ జైల్‌ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన

తనపై దాడి చేశారని ఎంపీ మలివాల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బిభవ్ ను కోర్టులో హాజరు పరచగా 7 రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఆయనకు మే 23 వరకు కస్టడీ విధించింది. బిభవ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా అప్ ఆదివారం (మే19)న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆంధోళన చేపట్టారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలతో కలిసి ఆదివారం (మే 19) బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చ్ వెళ్లారు. దీంతో ఢిల్లీ పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. భారీ భందోబస్తూ ఏర్పాటు చేశారు. వివాదాలు, కేసులతో ఆప్‌ను అణిచిపట్టలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఆప్‌ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే.. వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ‘జైల్‌ భరో’ పేరుతో భైఠాయించారు. 

స్వాతి మలివాల్‌ ఆరోపణలు నిజంకాదని ఆప్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియోను ఆప్ శనివారం ఎక్స్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో మహిళా రక్షణ సిబ్బంది స్వాతి మలివాల్‌ చేయి పట్టుకుని కేజ్రీవాల్‌ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంటి బయటివరకు ఆమె కూల్‌గానే వారితో నడుచుకుంటూ వచ్చారు. ఆమెకు దెబ్బలు తగిలినట్టు ఎక్కడా కనిపించ లేదు. ఇంటి మెయిన్‌ గేటు దాటిన తర్వాత సిబ్బంది నుంచి తన చేతులను విడిపించుకుని వారితో ఏదో అన్నారు.