- ట్రంప్ మీడియేషన్పై మన దేశం క్లారిటీ
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ అంశం ఇండియా–పాకిస్తాన్ మధ్య సమస్య అని, దానిని రెండు దేశాలు పరిష్కరించుకుంటాయని, ఇందులో వేరే వారి ప్రమేయం అవసరం లేదని మనదేశం బుధవారం స్పష్టం చేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) మీటింగ్ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ వివాదం పరిష్కారంలో సహకరిస్తామని ప్రకటించడంతో మనదేశం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. టెర్రరిజం, చర్చలు కలిసి నడిచే అవకాశం లేదని, ఈ విషయంలో మనకు స్పష్టమైన విధానం ఉందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. చర్చలకు ముందడుగు పడాలంటే ముందు పాకిస్తాన్ టెర్రరిజాన్ని అరికట్టాలని సూచించాయి. మంగళవారం స్విట్జర్లాండ్ దావోస్లో డబ్ల్యూఈఎఫ్ మీటింగ్ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. ‘‘కాశ్మీర్లో పరిస్థితులపై చర్చించాం. ఈ అంశంలో మీడియేషన్ చేసేందుకు సిద్ధం. కొన్ని సరిహద్దుల్లో మేము పాకిస్తాన్తో కలిసి పనిచేస్తున్నాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్కు సంబంధించిన వివాదంపైనా మేము చర్చించాం. మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ట్రంప్ చెప్పారు. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇమ్రాన్ ఆగస్టు 5 నుంచి అక్కడ తలెత్తిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కలుగజేసుకోవాలని, కాశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు. ఏడాది కాలంలో ట్రంప్తో ఇమ్రాన్ సమావేశం కావడం ఇది మూడోసారి. కాశ్మీర్ అంశంలో మీడియేషన్ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ చెప్పారు. అలా చెప్పిన ప్రతిసారీ ఇది ఇండియా–పాకిస్తాన్మధ్య సమస్య అని, రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని మనదేశం స్పష్టం చేస్తూ వస్తోంది.