- నల్గొండ, భూపాలపల్లి, నిజామాబాద్లో ఘటనలు
నల్గొండ క్రైం/ చిట్యాల/ నిజామాబాద్/ కమలాపూర్, వెలుగు: ఇంటర్లో ఫెయిలయ్యామన్నా బాధతో ముగ్గురు స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన జాహ్నవి రైలు కింద పడి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వరుణ్, నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన ధనుష్ ఉరి వేసుకొని ప్రాణాలు విడిచారు. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగలేదని, అయినా పరీక్షలు పెట్టి ఇట్లా ఫెయిల్ చేసి తమ బిడ్డల ప్రాణాలు తీసుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైలుకు ఎదురుగా వెళ్లి..!
నల్గొండ జిల్లా గాంధీనగర్కు చెందిన జాహ్నవి (16) స్థానిక గౌతమి కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. గురువారం విడుదలైన ఫస్టియర్ రిజల్ట్స్లో ఆ అమ్మాయి మ్యాథ్స్లో ఫెయిలైంది. అన్ని సబ్జెక్టుల్లో 56 శాతం మార్కులు వస్తే.. మ్యాథ్స్లో చాలా తక్కువ వచ్చాయి. తాను బాగానే రాసినా ఎందుకు ఫెయిలయ్యానని కలత చెందిన జాహ్నవి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి రైల్వే స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది.
ఉరేసుకొని ఇద్దరు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన కొల్లూరి బాబు, పూల దంపతుల కొడుకు వరుణ్(19) హనుమకొండలో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే ఉంటున్నారు. కరోనా కారణంగా క్లాస్లు సరిగ్గా జరగక ఇంటర్ పరీక్షలను వరుణ్ సరిగా రాయలేదు. ఫస్టియర్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనట్లు వచ్చింది. దీంతో వరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హనుమకొండలోని తన సమీప బంధువు దగ్గర డబ్బులు తీసుకొని, ఇంటికి వెళ్లి వస్తానని చల్లగరిగకు వచ్చాడు. ఇంటి వద్ద ఉంటున్న తాత పోశయ్య ఇంటికి తాళం వేసి పనికి వెళ్లాడు. వరుణ్ ఇంటి తలుపులను పైకి లేపి.. లోపలికి వెళ్లి ఉరేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాఅర్సపల్లికి చెందిన ధనుష్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ధనుష్ మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు.
నల్గొండలో స్టూడెంట్ సంఘాల ఆందోళన
ఇంటర్ రిజల్ట్స్ను ఇష్టమున్నట్లు ప్రకటించి పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని స్టూడెంట్ లీడర్లు మండిపడ్డారు. జాహ్నవి ఆత్మహత్య విషయం తెలుసుకొని నల్గొండలోని ఇంటర్మీడియట్ ఆఫీసు ఎదుట ఎస్ఎఫ్ఐ లీడర్లు ఆందోళనకు దిగారు. ఇంటర్ స్టూడెంట్లకు పాఠాలు చెప్పకుండా టెస్టులు ఎట్లా నిర్వహిస్తారని వారు నిలదీశారు. జాహ్నవిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారం నగేశ్ అన్నారు. జాహ్నవి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్.. కాపాడిన ఫ్రెండ్స్
హనుమకొండ జిల్లాలోని పసరగొండకు చెందిన ఓ అమ్మాయి కమలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నది. ఇంటర్ రిజల్ట్స్లో తాను ఫెయిలైనట్లు రావడంతో తీవ్రంగా కలత చెంది.. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైంలో హాస్టల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి దూకింది. గమనించిన తోటివారు వెంటనే చేతులు అడ్డుగా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్వల్ప గాయాలతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది.