పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్లు

పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్లు

సైబర్ క్రైం కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా…పట్టించుకోవడం లేదు నేరగాళ్లు. సినిమాను రిలీజ్ చేయక ముందే ఆన్ లైన్లో లీక్ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా వాళ్లకు సైబర్‌ కేటుగాళ్ల ముప్పు తప్పడం లేదు.  లేటెస్టుగా జబర్దస్త్ కమెడియన్లు అదిరే అభి, గడ్డం నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పాయింట్ బ్లాంక్’ సినిమా లీకైంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన ‘పాయింట్ బ్లాంక్’. సాయి పవన్ సంగీతం సమకూర్చగా.. పి.సి. కన్నా సినిమాటోగ్రఫీ అందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ ప్రింట్ ను ఆన్‌లైన్‌ నుంచి తీసేయాలని పోలీసులను కోరారు.