కాంగ్రెస్​కు మాల సంఘాల జేఏసీ మద్దతు

కాంగ్రెస్​కు మాల సంఘాల జేఏసీ మద్దతు

 ముషీరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. దేశంలో దళితులు, ముస్లింలపై అనేక దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న బీజేపీని ఓడించాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్ లోని జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడారు. దేశంలో  రాజ్యాంగాన్ని కూల్చి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. అలాంటి పార్టీని అధికారంలోకి రాకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓబీసీల రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మాల జేఏసీ మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ నాను, అనిల్, బరిగెల వెంకటస్వామి, ఎడ్ల వెంకటేశ్వర్లు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.