యువతను టెర్రరిస్టులుగా మారుస్తున్న ‘జమాతే ఇస్లామీ’

యువతను టెర్రరిస్టులుగా మారుస్తున్న ‘జమాతే ఇస్లామీ’

జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టేందుకు ‘జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్’ (జేఈఐ ) సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అందుకు ఐఎస్ ఐతో అంతర్గత సంబంధాలు కొనసాగిస్తోందని, ఢిల్లీలోని పాకిస్థాన్​ హైకమిషన్​తోనూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటోందని చెబుతున్నాయి. టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తుందనే ఆరోపణలతో కేంద్రం ఇప్పటికే జేఈఐని నిషేధించింది. ఆ సంస్థకు చెందిన ఆఫీస్ లను, ఆస్తులను సీజ్చేసింది. దీంతో ఆ సంస్థ కాశ్మీరీ యువకులను పావులుగా ఎంచుకుని ఇండియాకు వ్యతిరేకంగా ఉసిగొల్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ తాజా రిపోర్టులు బయటపెట్టాయి. ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, తద్వారా ఇండియాలోని భూభాగాన్ని విడదీసేలా కుట్రలు చేస్తున్నట్లు వెల్లడైంది.

యువకులకు ఆయుధాల సరఫరా, ట్రైనింగ్, తదితర జిహాదీ కార్యకలాపాలు కొనసాగించేందుకు జేఈఐ నాయకులు ఢిల్లీలోని పాక్ కమిషన్​తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాశ్మీరీ యువతను జిహాదీ గ్రూపుల్లో చేర్పించేందుకు జేఈఐ రూట్ లెవెల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసిందని, దీని ద్వారా కశ్మీర్ వ్యాలీ లోని స్కూళ్లలో పిల్లలకు జాతివ్యతిరేక భావాలను నూరిపోస్తోందని ఇంటలిజెన్స్ సీనియర్ అధికారి చెప్పారు. ఇస్లామిక్​స్టేట్ స్థాపించడమే లక్ష్యంగా.. కాశ్మీర్ వ్యాలీ అంతటా ఇప్పటికే ఇస్లామిక్ స్కూళ్లున్న జమాతే ఇస్లామీ సంస్థ.. యూత్​ వింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించడంతో పాటు, వాళ్లకు కావల్సిన ఆయుధాలు, డబ్బు, సౌకర్యాల కోసం ఇతర మిలిటెంట్ గ్రూపులతో కలిసి ఫండ్ వసూలు చేస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. హిజ్ బుల్ ముజాహిద్దీన్​జరిపిన దాడులను ఆసరాగా చేసుకుని స్థా నిక, విదేశీ సంస్థల నుంచి ట్రస్ట్ పేరిట ఫండ్ వసూలు చేస్తూ అట్టడుగు స్థాయి నుంచి జేఈఐ తన నెట్ వర్క్ ను బలపరుచుకోవాలని చూస్తోందని చెప్పాయి. యువతను జిహాదీవైపు రెచ్చగొట్టేందుకు వేలాదిగా ప్రచురణలు ఆ సంస్థ వద్ద ఉన్నట్లు తేలింది. జేఈఐ బంగ్లాదేశ్​, జేఈఐ పాకిస్థాన్​, జేఈఐ పీవోకే సంస్థలతో జేఈఐ జమ్మూకాశ్మీర్ సంస్థ సంబంధాలు కొనసాగిస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని పాకిస్థాన్​లో కలపడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఇంటలిజెన్స్ రిపోర్టు బయటపెట్టింది.