కాంగ్రెస్లో చేతులే కాదు మనసులు కూడా కలవాలి : జానారెడ్డి

కాంగ్రెస్లో చేతులే కాదు  మనసులు కూడా కలవాలి : జానారెడ్డి

కాంగ్రెస్ నేతల చేతులే కాదు తమ మనసులు కూడా కలవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ ను నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆయన తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. కాంగ్రెస్ నేతల చేతులే కాదు.. అందరి మనసులు కూడా కలవాలని సూచించారు. రాష్ట్రంలో నేతల మనసులు కలిసే దిశగా అందరూ ప్రయత్నించాలని చెప్పారు. ఎన్నో ఆయాస.. ప్రయాసలను భరించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.

మరో పది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని.. పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని జానారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ఆగడాలను ఎండగట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారని అన్నారు. కార్యకర్తల కష్టాలకు ముగింపు పలికే బాధ్యత అందరి మీద ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామగ్రామాన కరపత్రాల ద్వారా.. లోకల్ ఛార్జ్ షీట్ లతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని జానారెడ్డి సూచించారు.