అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు తాజాగా ఓ విజ్ఞప్తి చేసింది. భక్తులెవరూ శబరిమల ఆలయానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు ప్రెసిడెంట్ ఎన్. వాసు మంగళవారం తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని మిగతా అన్ని దేవాలయాల్లోనూ బహిరంగ సభలతో కూడిన పండుగలను రద్దు చేయాలని అభ్యర్థించారు.
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే దేశంలో 40పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా కేరళ ప్రజలు ఈ వైరస్ కారణంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా అక్కడ 6 కేసులు బయటపడగా.. మంగళవారం ఒక్కరోజే మరో ఆరు కేసులు పాజిటివ్ కేసులు స్వయంగా సీఎం పినరయి విజయన్ ఓ ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.
ఈ నెల 13 నుంచి 18 వరకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. నెలవారీ పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండగా.. ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు ఎన్.వాసు భక్తులను ఆలయాన్ని సందర్శివద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం తెలిసిన కొందరు భక్తులు.. వైరస్ బారిన పడకుండా టీడీబీ మంచి నిర్ణయమే తీసుకుందంటూ అభిప్రాయపడుతున్నారు.